పుట:కాశీమజిలీకథలు -01.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ధ్వనులీయ నఱచితిని. యెప్పటికిని బ్రతివచనంబు వినంబడినదికాదు.

అప్పుడు గుండెపగుల ధైర్యమాపుకొనుచు నీయడుగులజాడ నరయుచుండ నందు సింహపాదచిహ్నంబులు గనంబడినవి. ఆ సింగము నిన్ను మ్రింగెనని నిశ్చయించి నేలం జతికిలఁబడి పెక్కువిధంబుల శోకించితిని. మిత్రమా! అప్పటిరీతిఁ దలంచుకొనిన నిప్పుడును గుండెలు కొట్టుకొనుచున్నవి. చూడుము. అరణ్యరోదనంబుగా నేనట్లెంత శోకించినను నా మొర వినువారు నోదార్చువారు లేకపోయిరి. నాకు నేను యుపశమించుకొని యొంటియై నింటి కరుగ నిచ్చ లేక చచ్చుటయే మేలని నిశ్చయించి యప్పంచాననమే నన్ను గూడఁ బట్టుకొని చంపునని నిశ్చయించి దాని జాడ నరయుచుఁ గొంతతడ వయ్యడవిలోఁ గ్రుమ్మరితిని.

అప్పు డొకచోట నొకకంటకలతాగ్రమునం దగులుకొని వ్రేలాడుచున్న పత్రికయొకటి గనంబడినది. అది యేమియోయని దాని నందుకొని విప్పిచూడ నందు “మిత్రుఁడు బహుశ్రుతునికి నమస్కారములు. నేను సింహభయంబునం జెట్టెక్కి యందొక్కపక్షి రెక్కలలోఁ జిక్కుపడిన నది నన్నెక్కడికో యెత్తుకొని పోవుచున్నది. దైవమీరీతి మనకు వియోగము సంఘటించెను. నన్ను మనంబున నెప్పుడును స్మరించుకొనుచుండుము. నీ మక్కువ మఱపురాదు. మిత్రుఁడు విక్రమసింహుడు" అని వ్రాయబడియున్నది. దానిఁ జదివినంత నీవు బ్రతికియుంటివిగదా యని కొంత దైర్యము తెచ్చుకొని మనుష్యునెత్తుకొని బోవునంత బలముగల పక్షి యెద్దియోయని యూహించుచు భవదీయదర్శనాశం జేసి మరణనిశ్చయంబు విడిచి ప్రాంతంబులఁగల పల్లెలకరిగి యాపక్షి విశేషంబడిగిన నందొక వృద్ధకిరాతుం డిట్లనియె.

అయ్యా! ఆ పక్షి యెద్దియో దానిపేరు మాకుఁ దెలియదు. అది సంవత్సరమున కొకసారి యీయడవికి వచ్చి రెండుమూఁడుదినంబు లిందుగల పాలవృక్షముపై వసించి యేఁగుచుండు. అది బహుకాలమునుండి యట్లె మాసపక్షదివసంబు లతిక్రమింప యేకరీతి వచ్చుచున్న యది. అది క్రూరమైనదికాదు. మనుష్యులఁ జులకనగా మోచుకొనపోవునంత బలముగలిగియున్నదని దాని వృత్తాంత మెరింగించినంతఁ గొంతసంతసించి యదిమరల వచ్చు దివసం బడిగి తెలిసికొని క్రమ్మర నీవా పక్షితో వత్తువేమో యను నాసచే నింత దనుక భగవంతుని నారాధించుచుఁ గందమూలంబుల నాఁకలి యడంచుకొని జడదారివోలె నీ యడవిని సంచరించుచుంటిని. ఈ దినం బుదయమున నది వచ్చుననే వినియుంటిని గాన దానం బరీక్షించి నీవు రానిచో నొడలు విడువఁదలచియే యాపాలవృక్షముకడ నరుగుచున్నవాఁడ.