పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2024-25 ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్

గౌరవనీయ ఆర్థిక శాఖామాత్యుల వారి ప్రసంగం

ఫిబ్రవరి 07, 2024


గౌరవనీయ అధ్యక్షా!

మీ అనుమతితో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను.


2. గత ఐదేళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్ లను సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను.

3. ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మేము పొందుతున్న సంతోషకరమైన అనుభూతిని మహాత్మా గాంధీ గారి ఈ క్రింది మాటల ద్వారా తెలియజేస్తున్నాను.

"మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం,
ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం."

4. ఐదేళ్ల క్రితం, నా మొదటి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నప్పుడు, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు, మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన 3,648 కి.మీ పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి, ముఖ్యంగా పేద, బడుగు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం. మా మ్యానిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా, ప్రజలందరికీ నూటికి నూరు శాతం అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ఉత్తేజ పరిచింది.

సమాజంలో ఎవ్వరినీ వదలివేయకుండా
అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యతను ఇచ్చుటలో
స్వర్గీయ డా॥ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత మా పాలనను ప్రతిబింబిస్తుంది.

1