Jump to content

పుట:అభినయదర్పణము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

ఆంధ్రభాషయందు సంగీతలక్షణగ్రంథములు చాలయరుదు. అందును ఛందోబద్ధములైన పద్యకావ్యములుగా వెలువడినవి చాలవఱకు లేవనియే చెప్పనగును. అట్టిలోపము నీ గ్రంథము దీర్చిన దనుటకు సందియము లేదు. లక్షణగ్రంథములు ఛందోబద్ధములంగా రచించుట యెంతటివారికిని జాలఁ గష్టసాధ్యము. ఎట్టికవులకైనను లక్షణము ఛందోరూపమునఁ బొందుపఱుపవలసివచ్చినప్పుడు వ్యర్థపదముల ననేకముల యతిప్రాసాదులకై యుపయోగించుకొనకతప్పదు. అదియే యీ గ్రంథరచనయందును జాలవఱకు సాగినది. అట్టిది లక్షణగ్రంథములయం దొకదోషముగా నెంచి యాక్షేపింపవీలుపడదు. ఇదిగాక 'అపిమాషం మషంకుర్యా చ్ఛనదోభఙ్గంనకారయే' తనురీతిని గొన్నిపట్ల నీకవి ఛందోయతిప్రాసములకై కొన్నిపదములసైతము తాఱుమాఱు చేయక తప్పినది కాది. అవియే 'ఊర్ధ్వధోముఖము, పంచశత్కోటియోజనము, వరహావతారము' మొదలగునవి. ఈతని కవనమందుఁ జక్కనిధారాశుద్ధి గాననగును. ఈ ప్రబంధము స్వప్నమందుఁ దనకు సాక్షాత్కరించిన శ్రీవాసుదేవుని యాజ్ఞానుసారము గవి రచించినట్లు గ్రంథారంభమునఁ జెప్పియున్నాఁడు. ఇది మూఁడాశ్వాసములతోఁ గూడిన ప్రబంధము. ఇందు మొదటి యాశ్వాసమునఁ బ్రార్థనాదికము, భూలోకమునకు భరతశాస్త్ర మవతరించిన విధము, మునుముందు నాట్యమునకు వలసిన రంగనటన పాత్రాదిలక్షణములు ప్రధానముగా జెప్పఁబడినవి. ద్వితీయ తృతీయాశ్వాసములలో నభినయహస్లక్షణములు, వాని వినియోగములు పేర్కొనఁబడినవి. 'అభినయదర్పణ' మను నీ పేరితోనే సంస్కృతమునఁ గూడ నొకగ్రంథముగలదు. ఇది భరతార్ణవమునుండి సంగ్రహింపఁబడినది. దీనిని మనప్రబంధము గొంత యనుసరించినను దానికిని దీనికి బలుతావులలో భేదమును జాలఁ గలదు. దీనిని దానిని బరిశీలించిచూచిన నేదియో యొకమాతృకను రెండును నాధారముఁగాఁ గొని కొన్ని కొన్ని మార్పులతో భిన్నమార్గములయందు వెలువడినవని తోఁచెడిని. గ్రంథారంభమునందలి సుకవిస్తుతి స్వప్నషష్ఠ్యంతాదులును, నాశ్వాసాంతమందలి వృత్తవ్యత్యాసాదులును, విషయవిన్యాసమందలి క్రమపరిపుష్టి యను దీని నొకచక్కనిప్రబంధముగాఁ జేసినవి. సం. అభినయదర్పణమున నిట్టివేవియుఁ గానరావు. ఈ ప్రబంధమును వ్రాసిన కవి(కవి) మాతృభూతయ్య. కాశ్యపగోత్రుఁడు. ఇతని తండ్రి మృత్యుంజయార్యుఁడు. తాత నారనార్యుఁడు. ఇంటి పేరు లింగముగుంటవారు. యాజ్ఞవల్క్యచార్యు లీతని గురుదేవులు. ఇతఁడు కరిరాజవరదుని వరముచే జనియించిన పరమభాగవతోత్తముఁడు. సంగీత సాహిత్య భరతశాస్త్ర విద్యాపారంగతుఁడు. కవులలోఁ బోతనభక్తుఁ డగుటచేఁ గాఁబోలు నీతనిమన్నన కెక్కువగా నాతఁడు పాత్రమాయెను. అతనివలెనే యీతఁడును దనగ్రంథము నరాంకితము చేయక శ్రీరంగధామునకే గృతియొసఁగినాఁడు. ఈతఁ డందఱకంటెను మునుముందు సూర్యభగవానుని స్తుతించి గురుదేవులగు యాజ్ఞవల్క్యుల నుతించినాడు. ఇష్ట దైవతము