దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/స్వదేశోద్యమం

వికీసోర్స్ నుండి

మంత్రములు, మంత్రపుష్పమును వల్లించుటేగాని ఇతర విద్యాగంధ మాయన కావంతయు లేదు. వ్రాయను చదువనుగూడ అంతగా తెలియదు. వ్యవహారజ్ఞానమైనను శూన్యమే. అంతటివాడు గనుకనే మాయింట అంతకాల ముండుట తటస్థించెను. ఇంటికి కావలసిన బజారువస్తువు లాయనయే తెచ్చుచు చుండెడివాడు. ఆయన చేసినదే బేరముగాన అందువలన నష్టముగనే యుండెను. మరియెవ్వరును లేనందున ఆయనవల్లనే నడుపుకొన వలసివచ్చెను.

స్వదేశోద్యమం

మాపరిస్థితు లిట్లుండగా ఈమధ్యకాలములో దేశమున గొప్ప రాజకీయసంచలనము సంప్రాప్తమయ్యెను. బంగాళారాష్ట్ర విభజనవలన బంగాళములోనేగాక ఆసేతుహిమాచలము ప్రభుత్వమునెడ విరక్తి ప్రబలిపోయెను. కాంగ్రెసుమహాసభలో ఈవిభజనను ఖండించుటేగాక విదేశవస్తువులను బహిష్కరించి దేశములో నుత్పన్నమైన వస్తువులనేమాత్రమే స్వీకరించవలెనను తీవ్రదీక్ష వహించవలెనని కాంగ్రెసునాయకులు దేశమం దంతట నుపన్యాసముల గావించుచుండిరి. స్వదేశిఉద్యమము భారతదేశమం దంతట సాగుటవలన విదేశవస్త్రముల అమ్మకము పడిపోయెను. సీమలో పాటకజనుల జీవనోపాయమునకు భంగము కలిగెను. బొంబాయి, అహమ్మదాబాదు మిల్లులలో నేయబడిన వస్త్రములు వాడుకలోనికి వచ్చెను. చేమగ్గములవారికిగూడ పనులు హెచ్చెను. కత్తులు, చాకులు, గాజుసామాన్లు సబ్బులు మొదలగునవి మనదేశములోనే తయారుచేయుటకు కర్మాగార ములు కొన్ని స్థాపించబడెను. ప్రభుత్వమున కిది వెట్టబుట్టించెను. కాని ఇంతమాత్రమున ఈఉద్యమములో నున్నవారి నేమియు చేయలేకుండిరి. తమ క్రిందియుద్యోగులు స్వదేశవస్త్రములు ధరించుట సహింపకుండిరి గాన ఆ ఉద్యోగులు ఈ ఉద్యమమునకు దూరముగనే యుండిరి. జాతీయవిద్యాప్రచారము సాగుచుండెను. జాతీయగీతములు, పద్యములు జనులలో ప్రాకిపోయెను. వందేమాతరగీతము ప్రజలలో నూతనోత్సాహము పురికొల్పుచుండెను. ఆకాలమున బంగాళారాజధాని భారతదేశమునకు మార్గదర్శకమై విలసిల్లుచుండెను. ఆనాటి ఉద్యమముల కన్నిటికి ముఖ్యస్థానము కలకత్తాపట్టణమే. సురేంద్రనాధబెనర్జీ, డబ్లియు. సి. బెనర్జి, బిపిన్‌చంద్రపాల్ మొదలగు కాంగ్రెసునాయకులు వక్తృత్వమున సుప్రసిద్ధులు. వీరిలో బిపినచంద్రపాల్ కలకత్తామొదలు చెన్నపట్టణమువరకును గల పట్టణము లన్నిట స్వదేశోద్యమమునుగురించి మహోద్రేకపూరితములై, యువకుల వేడిరక్తము పొంగులెత్తించు గంభీరోపన్యాసముల నిచ్చి ఎన్నడు కనివినని ప్రజాందోళన గల్పించెను.

బిపినచంద్రపాలు బ్రాహ్మసామాజికుడు. సమాజసందేశ వ్యాప్తికై అంతకుముందొకసారి బందరుకు వచ్చి, మహోపన్యాసమొసంగెను. ఆనాడు బంగాళదేశమున ఆంగ్లేయవిద్యాధికులు పలువురు బ్రాహ్మసమాజికులే. వీరిలో అనేకులు విద్యావతులగు స్త్రీలుగూడ చేరియుండిరి. ఏ కేశ్వరోపాసనము, జాతి కులభేదములులేని సర్వమానవసమానత్వము, విగ్రహారాధననిషేధమును - ఈమతము హైందవమతమునుండి వేరుజేయువిశిష్టాంశ ములు. వీరిలో పలువురుదీక్షాపరులు, ఆస్తికులు, గౌరవపాత్రులు నుండిరి. విద్యార్థిగా నున్నపుడు పండితశివనాధశాస్త్రిగారి ఉపన్యాసములు వింటిని. నిర్మలచిత్తముతో పరమేశ్వరుని ధ్యానమొనర్చుచు అన్నిటికిని ఆయనయందే భారముంచి ప్రవర్తించుట పరమధర్మమని వారు వక్కాణించిరి. అందువలన కొఱతలేక జీవితము సాగగలదని బోధించి, అట్టి నిరతిశయ భక్తిప్రపత్తుల వలన కలుగు ఫలితమునకు స్వీయానుభవములను దృష్టాంతముగ పేర్కొనిరి. శశిపాదబెనర్జీ, హేమచంద్ర సర్కారుల సంభాషణలుగూడ నేను వింటిని. శశిపాదబెనర్జీగారు తొంబదిసంవత్సరముల వృద్ధులుగా నున్నపుడు కలకత్తాలోనే దర్శించి వారు ఋషికల్పులని భావించితిని. సీతానాదతత్త్వభూషణులు మహాపండితులు. వీరు శంకరసిద్ధాంతమునందలి మాయావాదమును ఖండించి, రామానుజుల సగుణతత్త్వమునే అంగీకరించి, నిర్గుణతత్త్వమును నిరసించిరి. శంకరుని నిర్గుణసిద్ధాంతమున భక్తిప్రపత్తుల కవకాశము లేదని వారి వాదము. ఈవిమర్శ కిందు స్థానములేదు. గాని నేను వ్రాసిన 'బ్రహ్మవిచార'మను పుస్తకమున ఈవిషయమైన చర్చలు వలయువారు చదువగలరు. మన ప్రాంతమున ఈ బ్రాహ్మమతమునవలంబించినవారిలో శ్రీ వేంకటరత్నంనాయుడు, వీరేశలింగముగార్లను గూర్చి ప్రశంచింతిని. నాయుదుగారు పిఠాపురము జమీందారుగారైన సూర్యారావుబహద్దరువారికి గురుప్రాయులుగ నుండి వారిచే అనేకసత్కార్యముల నొనర్పజేసిరి. ఆజమీందారుగారు బ్రహ్మసమాజమునందు అభిమానముకలవారయ్యు వారిసంస్థానమున నవరాత్రములలో వేదాధ్యయనపరులకును శాస్త్రజ్ఞులకును ఏటేట సన్మానములుచేయు నాచారము నడుపుచునే యుండిరి. జమీందారుగారి సతీమణి హిందూమతాభిమానిగా నుండి, దేవీపూజలు మొదలగునవి చేయుచుండెను. ఆమె దీపారాధన చేయుచుండగా అకస్మాత్తుగా చీరకు నిప్పంటుకొని మండుటచే దేహమంతయు కాలి మరణించెను. అప్పటినుండి జమీందారుగారి వర్తనలో కొంత మార్పుకలిగినట్లు చెప్పుచుందురు. మూడు నాలుగు సంవత్సరములక్రిందట వారు షష్ఠిపూర్తిఉత్సవము అతివైభవముతో గావించుకొనిరి. అపుడు బ్రహ్మసమాజము వారికిని, ఇతరపండితులు, కవులు, గాయకులు మొదలగువారి కనేకులకు భూరిసన్మానములు గావించిరి. ఆఉత్సవమునకు నేను వెళ్ళొ వారొనర్చిన పరోపకారకార్యములను ప్రశంసించితిని. కడప జిల్లాలో మైదుకూరునకు సమీపమున ఆనందాశ్రమములో చేసిన చిత్రవర్ణదారుశిల్పములు కొన్ని వారికి సన్మానపూర్వకముగ నొసంగితిని. ఈ చిత్రకారులు పనిచేయు ఆశ్రమమునకు విరాళరూపమున సహాయము చేయదగునవి శ్రీ రాజావారి కప్పుడు ముఖ్యసలహాదారులుగ నుండిన శ్రీ బులుసు సాంబమూర్తిగారి మూలకముగ తెలియపరచితిని. పిమ్మట పలుమార్లు జ్ఞాపకము చేసినను ఏమియు నీయలేదు. బ్రహ్మసమాజమును గూర్చిన శాఖాచంక్రమణము నింతట నాపి, మరల స్వదేశోద్యమము నెత్తికొందును. బిపినచంద్రపాలుని యుపన్యాసములచే ఆంధ్రదేశము ఉత్తేజితమైన ఆదినములలో బందరులో శ్రీ డాక్టరు భోగరాజు పట్టాభిసీతారామయ్యగారును, శ్రీ కోపల్లిహనుమంతరావుగారును, శ్రీముట్నూరికృష్ణారావుగారు అను ముగ్గురు యువకులు సార్వజనికములగు ఉపకారకార్యములందు ఉత్సాహము కల వారై యుండిరి. వీరిలో పట్టాభిసీతారామయ్యగారు వైద్యమునందు నిపుణులని పేరుపొంది ద్రవ్యోపార్జనసామర్థ్యము గలిగినవారు. కోపల్లి హనుమంతరావుగారు యం. ఏ పరీక్షయం దుత్తీర్ణులై దేశములో విద్యావిషయికమైన సేవచేయవలయునను గొప్పదీక్షతో జీవితమును అర్పణజేయసమకట్టిన మహోదారమూర్తి. శ్రీ ముట్నూరికృష్ణారావుగారు ఆంగ్లేయములో ప్రావీణ్యము లేకపోయినను తెలుగునందు గొప్ప ప్రావీణ్యము గణించి ఆంధ్రవ్యాసరచనయందు సమర్ధులు. దేశోపకారకార్యములందు అగాధమగు అభిమానము గలవారు. వీరు మువ్వురును బాల్యస్నేహితులు. పట్టాభిసీతారామయ్యగారు వక్తృత్వశుద్ధి గలవారు. పైన నుడివిన వీరి సామర్ధ్యములు కాలముగడచిన కొలది ప్రస్ఫుటములై ఆకర్షణీయములైనవి. ఈస్వదేశోద్యమమునందు వీరు మువ్వురును అనన్యమైన విశ్వాసము గలిగి జాతీయవిద్యావ్యాప్తికై కళాశాలాస్థాపన చేయ దీక్షబూనిరి. గ్రామములవెంట సంచారముచేసి ప్రజలకు స్వదేశోద్యమము, జాతీయాదర్శములు, జాతీయవిద్యాప్రాముఖ్యములను గూర్చి బోధించి కళాశాలనిమిత్తము విరాళములను వసూలుచేయ నారంభించిరి. వీరితోపాటు శ్రీవల్లూరిసూర్యనారాయణగారును కొంతవరకు కవుతాశ్రీరామశాస్త్రియను మరియొక ఉత్సాహపురుషుడును దేశపర్యటనమందు పాల్గొనిరి. ఈ శ్రీరామశాస్త్రిగారి కాంగ్లేయవిద్యావాసన లేకున్నను తెలుగున చక్కగ వ్రాయునేర్పు గలదు. మహాసభలందు వేలకొలది జనుల హృదయములు రాతిబండలైనను కరుగునట్లు భావపూరితములును మృదులపదగుంభితములును ఉత్సాహజనకములు నగుభాషణలు సలుపసమర్థులైన సంఘసంస్కరణాభిమానులు వీరు. వీరు వితంతూద్వాహముగావించుకొని సంఘబహిష్కరణబాధలనొందుచు కొన్నిగ్రంథములు తెలుగున వ్రాసి ప్రచురించియు, బంగాళాభాషాభ్యాసముచేసి, అందలి కధాగ్రంధములను ఆంధ్రీకరణముగావించి ప్రకటించియు, శారదయను మాసపత్రికను ప్రకటించియు ఈ రచనలవలన లభించిన స్వల్పాదాయముతో గాలిజీవనము చేయుచున్న యోగ్యపురుషులు, ఆకాలమున ఆంధ్రదేశమున సార్వజనిక జీవితమునందు గణనకెక్కిన ప్రసిద్ధవ్యక్తి. ఈయనకు పై జెప్పిన బందరుత్రయము చేయూత నొసగుచుండువారు.

ఇట్లు దేశపర్యటన గావించి, సొమ్ము సంపాదించి, బందరులో నొక విశాలస్థలము సంపాదించి, అందు కొన్ని భవనములను నిర్మాణముజేసి జాతీయకళాశాలను 1908 సంవత్సరమున స్థాపనగావించిరి. ఆకళాశాలా ప్రారంభోత్సవమున కాకినాడ న్యాయవాదులలో ప్రముఖులగు శ్రీ దురుచేటి శేషగిరిరావు పంతులుగారు అధ్యక్షతవహింప నాహూతులయ్యు రాజాలక పోయిరి. నేను అధ్యక్షత వహించి కళాశాలాప్రారంభము గావించుచు ఆంగ్లేయముననే యుపన్యసించితిని. కళాశాలాకార్యక్రమము నడిపించుట కొక కార్యనిర్వాహకసభ ఏర్పరుపబడినది. కళాశాలనిమిత్తము అయిదునూరులుగాని అంతకు మించిగాని విరాళములిచ్చినవారిలో కొందరితోపాటు నేనును అం దొక శాశ్వతసభ్యుడనుగా జేర్చబడితిని. స్వదేశోద్యమఫలితముగా ఆంధ్రదేశమున స్థాపితమైన బందరుకళాశాల కొంతకాలము ప్రజలచే మిక్కిలి శ్లాఘింపబడెను. కాని జాతీయవిద్యనుగూర్చి మిక్కిలి అభిమానోత్సాహములతో గంభీరోపన్యాసముల నిచ్చిన ఘనులెవ్వరుగాని వారిబిడ్డలను ఈకళాశాలకు పంపక ప్రభుత్వపాఠశాలలోనే విద్యగరపి ఉద్యోగములు లభింపజేసికొన జూచుచుండిరి. ప్రభుత్వపాఠశాలలో చేరుటకు ద్రవ్యము లేక, తిండికి గూడ జరుగని దరిద్రులుమాత్రము ఇందు విద్యార్థులుగ చేరుచుండిరి. వీరికి భోజనాదివసతులేర్పరచి, కొన్ని సంవత్సరములు శ్రీ హనుమంతురావుగారును, శ్రీ పట్టాభి సీతారామయ్యగారును చాల కృషిసల్పిరి. ఆకళాశాలలో దేశచరిత్రము, చిత్రకళావిషయములు, ఆంధ్రభాషాజ్ఞానముతోపాటుగ, చేతి పనులలోగూడ ప్రవేశముగల్గించుట కొక యంత్రాగారము స్థాపించిరి. రాట్నమువడికించుట, నేతనేయుట, తివాచీలునేయుట మొదలగు నిర్మాణకార్యములుగూడ నేర్పుచుండిరి. ఇట్లు ఉత్సాహముగ కొన్నిసంవత్సరములు నడచినవిగాని నానాట విద్యార్థులు తగినంతమంది లేక సన్నగిలిపోయినది. ఇంతటి దుస్థితి రాకపూర్వమే హనుమంతరావుగారు తా మంత నిష్కామ బుద్ధితో, త్యాగశీలముతో నిరంతరము నిద్రాహారములుమాని చేసిన సత్కార్యమునకు విద్యాధికులైనప్రముఖులలో సహితము ప్రోత్సాహములేకపోవుటచేత మన:క్లేశము పొందుచుండిరి. ఎడతెగని మహత్తరసేవయు, ప్రజలలో నిరుత్సాహమును ఆయన ఆరోగ్యమునకు భంగము కల్పించెను. తుద కాయన క్షయ వ్యాధిచే అకాలమృత్యువాత బడెను. అట్టి జ్ఞానమూర్తిని, నిష్కళంకసేవాతత్పరుని, సునిశిత ఆంగ్లభాషారచయితను, మహత్తరదేశభక్తుని, పావనచరిత్రుని గోల్పోయిన - ఆంధ్రదేశమే అననేల? - భారతదేశపు దౌర్భాగ్యమును వర్ణింపతరముగాదు. అప్పటి నుండియే ఆంధ్రజాతీయకళాశాలకు దుర్దశ ప్రారంభమైనది. సాలునకు పదివేలరూప్యముల ఆదాయము వచ్చు భూవసతి దానికిగలదు. గాంధిమహాత్మునకు కళాశాలయందును అందు పనిచేయు పట్టాభి సీతారామయ్య, హనుమంతరావు, కృష్ణరావులయందును గల అభిమానముచేత కాంగ్రెసుచే పదునారు వేలరూపాయల నొక్కసారిగ విరాళమిప్పించిరి. ద్రవ్యానుకూలమెంత యున్నను ప్రజలలో నిజమైన జాతీయవిద్యాభిమానము లేమిచే కళాశాలోద్దేశములు నెరవేరవాయెను. నేడు స్వరాజ్యము స్వాతంత్ర్యము లభించినవి గాన ఈకళాశాలలో జాతీయవిద్యతోపాటు స్వతంత్రముగ జీవితముజరుపుటకు తోడ్పడగల చేతిపనులను నేర్పు ఏర్పాటులు జరుపుటకు ప్రభుత్వము శ్రద్ధ వహింపదగును.

అనాదిసిద్ధమైన వంగజాతి ఐక్యమునకు భంగముగావించి దాని ప్రాధాన్యమును గౌరవమును నశింపజేయుటకు కర్జను ప్రభువు చేసిన ఈ దుష్ప్రయత్నము ఆయన యనంతరమున హార్డింజి హయాములో ప్రభుత్వము విడనాడవలసివచ్చెను. పూర్తికాబడిన విభజన మరల మార్చబడదని ప్రతిజ్ఞాపూర్వకముగ ఇండియాకార్యదర్శి వచించిన వాక్యము మరల దిగమ్రింగవలసివచ్చెను.

ఆంధ్రోద్యమబీజములు

గవర్నరుజనరల్ హార్డింజి "ఒక్కభాషయు, ఒక్క మతమును, ఒక్క సంస్కృతియు గల జనులు ఏకముగ