దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కురుంగుడి

వికీసోర్స్ నుండి

57. తిరుక్కురుంగుడి 17

శ్లో. శ్రీక్షీరాబ్ది తరజ్గిణీ తటతలే పూర్ణాహ్వయ శ్రీ పతి:|
    దివ్యే భాతి తిరుక్కురుజ్గుడి పురే పంచాకృతి ద్యోతిత:|
    సంప్రాప్త శ్శుభ పంచకేతిక పదం వైమాన మైంద్రీముఖ
    స్థాయీ సాక్షి పదం కురుజ్గుడి లతానాథ శ్శఠారి స్తుత:||

శ్లో. శ్రీ మద్విష్ణు మన శ్శ్రీమత్పర కాల వచ:ప్రియ:|
   రామానుజార్య మునిపాత్కృతో భయ విభూతిక:

వివ: వైష్ణవ నంబి. మలైమేల్ నంబి; నిన్ఱ నంబి, ఇరుంద నంబి; కిడంద నంబి, తిరుప్పార్‌కడల్ నంబి అను పంచాకృతులలో వేంచేసియున్నారు. కురుంగుడి వల్లి తాయార్; తిరుప్పార్ కడల్ నది; పంచకేతక విమానము; తూర్పు ముఖము, నిలుచున్న సేవ, పరమ శివునకు ప్రత్యక్షము, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. ఉడయవరులకు ఉభయ విభూతి నాయకత్వమును అనుగ్రహించిన స్థలము.

విశే: ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఇచట స్వామి వడుగ నంబి రూపముతో ఉడయవరులను (శ్రీరామానుజులను) ఆశ్రయించి వారి నుండి మంత్రోపదేశమును పొంది సకల వేదాన్తార్థములను గ్రహించి "మేమును శ్రీభగవద్రామానుజులను ఆశ్రయించితిమి; దన్యులమైతి" మని ఆనందముతో ప్రకటించుటచే ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము మిధునమాసములో జరుగును. వామనుడు వసించిన చోటగుటచే కురుజ్గుడి యనియు సిద్దాశ్రమమనియు పేరు వచ్చెను. ఉడయవర్ తడివస్త్రములను ఆరబెట్టిన "తిరువట్టప్పారై" ఇచట సేవింపవచ్చును. ఇచట ఉడయవర్ అంజలి ముద్రతో కాక జ్ఞాన ముద్రతో వేంచేసియుందురు. నిన్ఱ-కిడంద నంబుల సన్నిధుల మధ్య శివుని ఆలయము కలదు.

ఈ సన్నిధికి 10 కి.మీ దూరములో కొండమీద మలైమేల్ నంబి సన్నిధి గలదు. ఈ దివ్యదేశమున తాయార్; పెరుమాళ్లతో కలసి వేంచేసియుందురు. మీనం ఉత్తర తీర్థోత్సవము.

ఈ క్షేత్రమును గూర్చి ఆళ్వార్లు "విఱైన్ద శోతి వెళ్లమ్‌ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యోడుమ్‌, విఱైన్దెన్నుళ్లే నిన్ఱొழிన్దాన్" "పరిపూర్ణమైన కాన్తి ప్రవాహముచే పరీవృతమై స్పృహణీయమైన దివ్య మంగళ విగ్రహముతో స్వామి నా హృదయమున వేంచేసి యున్నాడు." అనియు "నీలమేనియుమ్ నాన్గు తోళుమ్‌ ఎన్నెంజం నిఱైన్దనవే" నీలమేఘ శ్యామలమైన తిరుమేనియు చతుర్బుజములు గలిగి నామనస్సున నిండియున్నాడు." అనునట్లుగా విభవావతార లావణ్యమును అర్చావతారమందు దర్శించిరి.

సూచన: ఇచట ఎంబెరుమానార్లు స్వామికి మంత్రోపదేశము చేయుటచే అన్ని దివ్య దేశములలో వలె అంజలి ముద్రతో గాక జ్ఞానముద్రతో వేంచేసియుందురు. తిరుమంగై ఆళ్వార్ శ్రీరంగనాథుని యాజ్ఞానుసారము తిరునాడలంకరించిన ప్రదేశమును వారిని తిరుప్పళ్లి చేర్చిన స్థలమును ఇచట సేవింపవచ్చును.

మార్గము: నాజ్గునేరి(వానమామలై) నుండి 15 కి.మీ దూరములో గలదు. బస్‌వసతి కలదు. నాంగునేరి నుండి కళక్కాడు పోయి అటనుండి వేరు బస్‌లో తిరుక్కురుజ్గుడి చేరవచ్చును. రామానుజకూటము, జీయర్‌స్వాముల మఠము కలవు. మితమైన సౌకర్యములు గలవు.

పా. నిఱైన్ద వన్బழி నజ్కుడిక్కివళెన్ఱు; అన్నై కాణ కొడాళ్;
    శిఱన్ద కీర్తి త్తిరుక్కురుజ్గుడి నమ్బియై; నాన్ కణ్డ పిన్;
    నిఱైన్దశోతి వెళ్ళమ్‌ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యొడుమ్;
    నిఱైన్దెన్నుళ్లే నిన్నొழிన్దాన్; నేమియజ్గై యుళతే.
             నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-5-7


మంచిమాట

"ఆవిద్య"

        అనాత్మన్యాత్మ బుద్ధి ర్వా అస్వేస్వమితి యామతి:
        అవిద్యా తరు సంభూతి:బీజమేతత్‌ద్విథా స్థితమ్‌||

అవిద్య అనునది యొక వృక్షము.
ఈ వృక్షమునకు పుట్టిన బీజములు రెండు
1. ఆత్మకాని దేహేంద్రియాదులను ఆత్మ అని భావించుట.(అహంకారము)
2. తనదికాని ఆత్మను తనదియని తలంచుట (మమకారము) సంసారులగు చేతనులు ఈ అవిద్యతో కూడియుందురు. ఈఅవిద్య వలన దేవతిర్యక్ మనుష్య స్థావరములను నాల్గు విధములైన జన్మలు కలుగును. కావున ప్రాజ్ఞుడైనవాడు అవిద్యను పారద్రోలవలెను. అనగా అహంకార మమకారములను విడచిపెట్టవలెను.

58. తిరుక్కోళూరు 18

శ్లో. శ్రీకోళూర్ నగరే కుబేర సరసీ శ్రీ తామ్రపర్ణీ తటే
   యుక్తే శ్రీ కర దేవయాన నిలయో భోగేశయ: ప్రాజ్ముఖ:|
   శ్రీకోళూరు లతా పరిష్కృత వపు ర్నిక్షిప్త విత్త:ప్రభు:
   కౌబేరాక్ష్యతిథి శ్శఠారి మునినా సంకీర్తితో రాజతే||

వివ: "వైత్తమానిది" పెరుమాళ్(నిక్షిప్తవిత్తన్)-కోళూర్ వల్లి తాయార్, కుబేర పుష్కరిణి; తామ్రపర్ణీనది;శ్రీకర విమానము; భుజంగ శయనము; తూర్పు ముఖము; కుబేరునకు, మధురకవి యాళ్వార్లకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ దివ్యదేశ పెరుమాళ్ల విషయమై ఆళ్వార్లు "వైత్తమానిదియామ్‌ మదుశూదనైయే యలత్తి" ("నిక్షిప్తవిత్తన్"(నిధివలెనున్నస్వామి)అగుమధుసూదనుని ఆర్తితో జపించి)" అని అపత్పఖత్వమను గుణమును(అనగా ఆపదలో ఆదుకొనుట) ప్రకాశింపజేసిరి. మఱియు ఈ దివ్యదేశమునకు "పుకుమూర్" అను విలక్షణమైన తిరునామమును కృపజేసిరి. అనగా ఇచటి స్వామియొక్క నిరుపమాన సౌందర్యమును సేవించినవారు వెనుదిరిగి వెళ్లలేరని భావము. నవనిధులు ఇచట దాగియున్నవని అధర్మము కుబేరునితో కొండెములు చెప్పెనట. ఆకారణమున ఈ క్షేత్రమునకు కోళూరు అను పేరు కలిగెనని చెప్పుదురు. ఇది మధురకవి ఆళ్వార్ల అవతారస్థలము.

సూచన: సింహమాసం పునర్వసు తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. తెన్ తిరుప్పేరై ఈ దివ్యదేశమునకు 3 కి.మీ దూరమున గలదు.

మార్గము: తెన్ తిరుప్పేరై నుండి ఆళ్వార్ తిరునగరిపోవు మార్గమున చిన్నకాలిబాట మార్గములో ఈ క్షేత్రము గలదు.

పా. ఉణ్ణుమ్‌ శోఱు పరుగునీర్; తిన్నుమ్‌ వెత్‌త్తిలైయు మెల్లామ్‌
    కణ్ణన్; ఎమ్బెరుమానెన్ఱెన్ఱే; కణ్‌గళ్ నీర్ మల్‌గి;
    మణ్ణి నుళవన్ శీర్ వళమ్మిక్క; వనూర్ వినవి;
    తిణ్ణిమెన్నిళమాన్ పుగుమూర్;తిరుక్కోళూరే.
             నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-7-1

    ఏవం శ్రీ పాండ్య దేశస్థ స్థలానాం వర్ణితో మయా|
    పురాణ సూక్త్యా యుక్తానాం వర్ణిత: శ్రీశ భక్తిత:||

శ్రియ: పతియందు గల భక్తితో పాంద్యదేశములోని దివ్యదేశములు వర్ణింపబడినవి.

                  మళయాళ దివ్య దేశములు

    మలయాళ మహాదేశ దివ్య క్షేత్రేషు సంభవమ్‌|
    విజ్ఞాపయామి విభవం యతిరాజ కటాక్షత:||

శ్రీ భగవద్రామానుజుల వారి కృపచే మలయాళ దేశము నందు గల దివ్య స్థలముల యొక్క వైభవమును ఇకపై విన్నవింతును.