అధ్యాయము - ౪

వికీసోర్స్ నుండి
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

శా.

సూతా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్ఠు నే

శ్రోతల్ గోరిరి యేమిహేతువునకై శోధించి లోకైక వి

ఖ్యాతిన్ వ్యాసుఁడు మున్ను భాగవతముం గల్పించెఁ దత్పుత్రుఁడే

ప్రీతిన్ రాజున కీ పురాణకథఁ జెప్పెన్ జెప్పవే యంతయున్. 73


వ.

బుధేంద్రా! వ్యాసపుత్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం డేకాంతమతి

మాయాశయనంబువలనం దెలిసినవాఁడు గూఢుండు మూఢునిక్రియ నుండు

నిరస్తఖేదుం డదియునుంగాక. 74


తరల.

శుకుఁడు గోఁచియులేక పైఁజనఁ జూచి తోయములందు ల

జ్జకుఁ జలింపక చీరలొల్లక చల్లులాడెడి దేవక

న్యలు "హా శుక" యంచు వెన్కఁ జనంగ వ్యాసునిఁ జూచి యం

శుకములన్ ధరియించి సిగ్గున స్రుక్కిరందఱు ధీనిధీ! 75


వ.

మఱియు నగ్నుండు దరుణుండునై చను తన కొడుకుం గని వస్త్రపరిధానం బొనరింపక

వస్త్రధారియు వృద్ధుండునైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవ రమణులం

గని వ్యాసుండు గారణం బడిగిన వారలు నీ కొడుకుది సతి వీఁడు పురుషుండని

భేదదృష్టి లేకయుండు. మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి

మహాంతరంబు గలదనిరి. అంత శకుండు కురుజాంగల దేశంబులు సొచ్చి

హస్తినాపురంబునఁ బౌరజనంబులచే భారతికాపీనెట్లు జ్ఞాతుఁడయ్యె? మఱియు నున్మత్తుని క్రియ

మూఢుని తెఱంగున జడుని భంగి నుండు నమ్మహాయోగికి రాజర్షియైన పరీక్షిన్మహారాజుతోడ

సంవాదం బెట్లు సిద్ధించె? బహుకాల కథనీయంబైన శ్రీభాగవత నిగమవ్యాఖ్యాన మేరీతి

సాగె? అయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబున గోవునుబిదికిన యంతతడవుగాని నిలువఁడండ్రు

అతండు గోదోహన మాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబులగు. ఫెద్దకాల

మేకప్రదేశంబున నెట్లుండె? భాగవతోత్తముండైన జనపాలు జన్మకర్మంబు

ల్వ్ ప్రకారంబులు? వివరింపుము. 76


సీ.

పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ

బరిపంథిరాజులు భర్మాదిధనముల నర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ

గుంభజకర్ణాది కురుభటవ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరుతండ్రి

గాంగేయసైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరుతాత

ఆ.

యట్టి గాఢకీర్తి యగు పరీక్షన్మహారాజు విడువఁదగని రాజ్యలక్ష్మిఁ

బరిహరించి గంగఁబ్రాయోపవిష్టుఁడై యసువులుండ నేల యడఁగియుండె. 77


ఉ.

ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నఁడున్

జిత్తములందుఁ గోరరు హసించియు, లోకులకెల్ల నర్థసం

పత్తియు భూతియున్ సుఖము భద్రముఁ గోరుదు రన్యరక్షణా

త్యుత్తమమైన మేను విభుఁడూరక యేల విరక్తిఁ బాసెనో. 78


క.

సారముల నెల్ల నెఱుఁగుదు

పారగుఁడవు భాషలందు బహువిధ కథనో

దారుఁడవు మాకు సర్వముఁ

బారము ముట్టంగఁ దెలియఁ బలుకు మహాత్మా! 79


వ్యాసుండు వ్యాకులచిత్తుఁడై చింతించుట[మార్చు]

వ.

అనియడిగిన సౌనకాది మునిశ్రేష్ఠులకు సూతుండిట్లనియె. తృతీయంబైన ద్వాపర

యుగంబు దిరుగు సమయంబున నుపరిచరవసువు వీర్యంబున జన్మించి వాసవి

నాఁదగు సత్యవతియందుఁ బరాశరునికి హరికళంజేసి విజ్ఞానియైన వేదవ్యాసుండు

జన్మించి యొక్కనాఁడు బదరికాశ్రమంబున సరస్వతీనదీజలంబుల స్నానాది

కర్మంబులందీర్చి శుచియై, పరులు లేనిచోట నొంటిఁ గూర్చుండి, సూర్యో

దయము వేళ నతీతానాగత వర్తమానజ్ఞుండై యా ఋషి వ్యక్తంబుగాని వేగంబు

గల కాలంబునంజేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబువొందు. యుగ

యుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నమగు. పురుషులు నిస్సత్త్వులు

ధైర్యశూన్యులు మందప్రజ్ఞులల్పాయువులు దుర్బలులు నయ్యెదరని తన దివ్య

దృష్టింజూచి సర్వవర్ణాశ్రమంబులకు హితంబు సేయందలచి, నలుగురు హోతల

చేత ననుష్ఠింపందగి ప్రజలకు శుద్ధికరంబులైన వైదికకర్మంబులగు యజ్ఞంబు లెడ

తెగకుండ కొఱకు నేకంబైన వేదంబు ఋగ్యజుస్సామాధర్వణంబులను నాలుగు

నామంబుల విభాగించి యితిహాస పురాణంబు లన్నియుఁ బంచమవేదంబని

పల్కెనందు. 80


సీ.

పైలుండు ఋగ్వేద పఠనంబు దొరఁకొనె సామంబు జైమిని చదువుచుండె

యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ దుది నధర్వము సుమంతుఁడు పఠించె

నఖిలపురాణేతిహాసముల్ మాతండ్రి రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ

దమతమవేద మా తపసులు భాగించి శిష్యసంఘములకుఁ జెప్పి రంత

గీ.

శిష్యులెల్లరు నాత్మీయ శిష్యజనులకందు బహుమార్గములు చెప్పి యనుమతింపఁ

బెక్కుశాఖలుగలిగి యీపృథివిలోన నిగమ మొప్పారె భూసుర నివహమందు 81


వ.

ఇట్లు మేధాహీనులైన పురుషులచేత నట్టి వేదంబులు ధరియింపబడుచున్నవి.

మఱియు దీనవత్సలుండైన వ్యాసుండు స్త్రీశూద్రులకుం ద్రైవర్ణికాధములకు

వేదంబులు విన ననర్హంబులు గావున, మూఢులకెల్ల మేలగునని భారతాఖ్యానంబు

చేసియు నమ్ముని, భూతహితమందుఁ దనహృదయము సంతసింపకున్న సరస్వతీ

తటంబున నొంటినుండి హేతువు వితర్కింపుచుఁ దనలో నిట్లనియె. 82


సీ.

వ్రతధారినై వేద వహ్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మములఁ గొఱఁత

పడకుండ నడపుదు భారతమిషమునఁ బలికితి వేదార్థ భావమెల్ల

మును కొని స్త్రీశూద్ర ముఖరధర్మములందుఁ దెలిపితి నేఁజెల్ల దీనఁజేసి

యాత్మ సంతసమంద దాత్మలో నీశుండు సంతసింపకయున్న జాడదోఁచె

ఆ.

హరికి యోగివరుల కభిలషితంబైన భాగవత విధంబుఁ బలుకనైతి

మోసమయ్యెఁ దెలివి మొనయదు మఱచితి ననుచు వగచుచున్న యవసరమున 83


వ్యాసుని కడకు నారదుండు వచ్చుట[మార్చు]

సీ.

తనచేతి వల్లకీతంత్రీచయంబున సతత నారాయణ శబ్దమొప్ప

నానన సంభూత హరిగీతరవసుధాధారల యోగీంద్రతతులు సొక్కఁ

గపిల జటాభార కాంతిపుంజంబుల దిశలు ప్రభాతదీధితి వహింపఁ

దన్నులగ్నతులసికాదామ గంధంబులు గగనాంతరాళంబుఁ గప్పికొనఁగ

ఆ.

వచ్చెమింటనుండి వాసవీనందను కడకు మాటలాడఁ గణఁకతోడ

భద్ర విమలకీర్తి పారగుఁ డారూడ నయవిశారదుండు నారదుండు 84


క.

కనియె న్నారదుఁడంతన్

వినయైక విలాసు నిగమ విభజన విద్యా

జనితోల్లాసున్ భవదుః

ఖ నిరాసున్ గురుమనోవికాసున్ వ్యాసున్. 85


వ.

ఇట్లు నిజాశ్రమబునకు వచ్చిన నారదునెఱింగి లేచి వ్యాసుండు విధివత్ క్రమం

మునం బూజించిన నతండు లేనగవు నెగడెడి మొగంబుతోడ విపంచికాతంత్రి వ్రేల

మీటుచు నిట్లనియె. 86



భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము