xxxxi
కడు రక్తిమము గల్గు గండస్థలంబులు
వెనుకకు దిగజాఱి వ్రేలు సరులు
పులకలు నిండారఁ బొడమిన దేహంబు
ధూళిధూసరితమై దొరయు వీఁపు
మందస్మితంబగు మధురాధరంబును
మంద వీక్షణ నమ్ర మస్తకంబు
తే. తడఁబడ వడంకుచుండెడు తలిరుదొడలు
వదలిన బిగించి సడలించు వలువదనరఁ
దిరిగి చూచుచుఁ దనయింటి తెరువుఁబట్టి
గొల్ల ప్రాయంపుఁ జిల్కలకొల్కి చనియె. (2-108)
లోకజ్ఞత
నారాయణకవి నవీనుఁడు. కవిత్వము నేర్చిన కరణము బిడ్డ. గ్రంథములను జదివి నేర్చికొన్న విషయ పరిజ్ఞానము వేఱు. లోకమును బొదివి కూర్చికొన్న విషయ పరిజ్ఞానము వేఱు. మొదటిది చాలమందికి సంగతము కావచ్చు. రెండవది దుర్లభము. ఈ కవి లోకజ్ఞతా విశేషముసకు ఈ ప్రబంధము పంట పొలము.
పదునేనవ రాత్రి కథలోఁ గాఁపుటిల్లు వర్ణించెను. గొడ్డు గోదము, గింజ గిట్ర గల సంపన్న గృహస్థుని యింటి పోడిమి కనులఁ గట్టినట్లు వర్ణించెను.
ధాన్యముల రకములు చెప్పెను. వడ్ల రకములు చెప్పెను. ఎత్తుగీతిగాక 24 పెద్ద పాదముల సీసమాలిక వడ్ల పేరులు చెప్పుటకే సరిపోయినది. కూరగాయలు, కూరాకులు, పండ్లు, ఊరుగాయలు, వీనికి వేర్వేఱు సీసములు. “రామ గుమ్మడి, యోబరాజు గుమ్మడి, చార గుమ్మడి, బూడిద గుమ్మడులును" అని చతుర్విధ కూష్మాండ భేదములు చెప్పెను.