పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

దానిపే రేమి యుండెడుతా వదేది
చెప్పు మేర్పడ నేఁ బెండ్లి సేయు దిప్పు
డంచు వకుళాడ నాచక్రి యనియె జనని
వినుము చెస్పెదనని యప్డు వివర మెల్ల.

320


సీ.

జనని యాక్రమము నిశ్చయముగ విను సుధా
        కరునికులజుఁడు నాకాశరాజు
తనకు సంతతి లేక ఘనపుత్త్రకామేష్ఠి
        దనరఁ గావింప నద్ధరణితలము
దున్నింప నవనిలోఁ దోయజం బుదయించె
        నాతోయజంబునం దామృగాక్షి
గనుపింపఁగాఁ దెచ్చి గగనాధిపుఁడు పెంచె
        ధరను బద్మావతి దానిపేరు


తే.

పరఁగ దానికి నాకు దాంపత్య మజుఁడు
నిశ్చయము చేసి యుండెనా నేను బ్రదుక
గలను లేకున్న నిచ్చోట నిలువలేను
వనిత వైకుంఠపురిఁ జేరవలయుఁగాక.

321


వ.

అమ్మా! విను మక్కన్యకామణి లక్ష్మీసమాన యగుంగావున
జన్మాంతరపుణ్యంబును గలపుర్షునకు లభించుంగాని పెఱవారి
కేల లభించు. మత్పుణ్యపరిపాకంబున నక్కన్య నీక్షించి
సంభాషింషఁగలిగె. నట్టిసుందరిం జూచి విడిచివచ్చితి. నిఁక
నాకన్నోదకంబు లభిలషింప సప్పద్మావతి నాయందు ననురక్తి
లేమి చెలులం బురికొల్పి శిలావృష్టిం గుఱియించె. నావృష్టి
కోపంజాలక తురంగంబుపైఁ బడి తెప్పున నిప్పర్వతం బారో
హించి పునర్జీవితుండైతి. నజుం డట్టిసుందరిం బుట్టించి కట్టిఁడి