పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

257


తే.

పరఁగ నానాగకన్య గర్భంబుఁ దాల్చి
నాగలోకంబునకుఁ బోవ భోగినాథుఁ
డావిధంబు నెఱింగి యేమనక కార
ణంబు నూహించి మది సంతసంబు నొందె.

203


క.

ఆకన్యక కందఱు దగఁ
జేకొని రక్షించుచుండ శ్రీకరుఁ డనఁగాఁ
బ్రాకటశుభలగ్నమున సు
ధాకరునింబోలెఁ గల్గెఁ దనయుం డెలమిన్.

204


తే.

అంతకంతకు నభివృద్ధి యగుచు బాలుఁ
డమ్మ నాతండ్రి యెవ్వఁడటంచు నడుగ
నాగకన్యక వినుచును నగుచుఁ దనయు
నెత్తి ముద్దాడి లాలించి యిట్టు లనియె.

205


తే.

తనయ నీజనకుండు సుధర్మరాజు
ధారుణీతలమును బ్రసిద్ధంబుగాను
బాలనము సేయు నటకు నిర్భయుఁడ వగుచుఁ
బోవలసియున్న సుఖముగఁ బొమ్ము తనయ.

206


ఉ.

అచ్చట నర్ధరాజ్యము మహాముద మందఁగ నాఘనుండు నీ
కిచ్చు సుధర్మపద్ధతిగ నేలుము నన్నుఁ దలంచుచుండు మిం
కిచ్చట కార్య మేమి యట కేగి సుఖంబుగ నుండుమంచుఁ దా
మచ్చికమీరఁ జెప్పి చనుమార్గము తేటఁగఁ జూపెఁ బ్రీతితోన్.

207


వ.

అప్పు డబ్బాలుండు మాతామహుం డగునాగరాజేంద్రునకు
నమస్కరించి దీవనలంది తల్లికి నమస్కరించి దీవనలంది పాతాళ
బిలమార్గంబున నిర్గమించి వచ్చుచుండఁ దల్లియు వెంటనంటి
భూమిపైకిం దెచ్చి విడిచి తనభర్త యొసంగినయుంగరం బక్కు