పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

217


క.

లవణాబ్ధిలోనిమణులను
దివిజులు శిరమున ధరించుతెఱఁగున నే ని
న్నవని వరించి ధరింతని
వివరించి భయంబు విడచి విప్రుం డనఁగన్.

72


చ.

విని యది భీతినొందుచు వివేకము న్ద్విజుమోముఁ జూచి యి
ట్లనియెను జారకాంతను మహావిషసర్పము నంటి యెవ్వరై
నను మనినారె? ప్రేమ నిను నమ్మి భార్యను వీడి నన్నుఁ బొం
దిన నిహముం బరంబుఁ జెడు ధీరతతోఁ జను బ్రాహ్మణోత్తమా!

73


వ.

మహాత్మా స్త్రీపురుషులకు జాతిద్వయంబును నిర్మాణంబు చేసి
మఱల నందుఁ గులంబులు నాల్గింటిని యేర్పఱచి యేకులము
వారి కాకులమునందు స్త్రీని వివాహం బాడంజేసి స్వభార్య
యందు సత్సంతానంబు వడసి పరస్త్రీని యపేక్షింపక యుండ
వలెనని ధర్మశాస్త్రాదులు బోధించుచుండ, నీ వట్టిధర్మంబు
లెఱింగియుఁ గేవలము చండాలస్త్రీనిం గోరుట యధర్మంబు
గదా? మరియు బ్రాహ్మణజన్యం బత్యుత్తమోత్తంబై యుండ
నందు బుట్టి గర్భాధానాదిషోడశకర్మంబుల నాచరించి వేద
పూతం బగునీదేహంబు వృథా యకృత్యంబునకుఁ జిక్కింప
నేల, మఱియు నీశ్రోత్రనేత్రజిహ్వాఘ్రణపాణిపాదంబు
పుణ్యకథాశ్రవణభగవద్దర్శనహరిపాదార్చితపుష్పాఘ్రాణవే
దాధ్యయనదానతీర్థయాత్రాదిసత్క్రియలచేతఁ బవిత్రంబు
లైనవి. మదీయశరీరంబు దుష్క్రియలచే నపవిత్రంబైనది.
కాఁబట్టి నన్నంటరాకుము, దూరంబున నిలువుమని కోకిల
ధ్వనితోఁ జెప్పుకుంతలమాటలు విని యోపంజాలక యవ్వి
ప్రుండు దానిం గదియఁబోవ నది పాపభీతిచే రోదనంబు