పుట:మత్స్యపురాణము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

115


సీ.

తానంబు దీర్చి ధౌతములైన వస్త్రముల్
        ధరియించి సాంధ్యకృత్యములు నడపి
విజనస్థలంబున విమలపద్మాసనా
        సీనుఁడై యంత నిశ్చింతుఁ డగుచు
నయనవాగాదికేంద్రియనిరంకుశబాహ్య
        గతి నంతరాత్మసంగతము చేసి
కామరోషాదులఁ గట్టి మూలకుఁ ద్రొబ్బి
        శీతోష్ణములచేతఁ జిక్కువడక
యోగిపురుషుండు హర్షసంయుక్తుఁ డగుచు
ద్వాదశారసమేతహృద్వనజమందుఁ
బ్రణవ మంత్రాక్షరంబులఁ బాదుకొల్పి
తత్పయోరుహకర్ణిక తలము సేసి.

111


సీ.

శ్రీవత్సకౌస్తుభశ్రీయుక్తవక్షుని
        లలితపీతాంబరాలంకరిష్ణు
నతులకుండలరుచివ్యాప్తగండద్వయు
        నంచితవక్త్రపద్మాభిరాముఁ
బుండరీకాక్షు నంబోధరశ్యామల
        దేహుఁ గిరీటదేదీప్యమాను
శార్ఙ్గనందకసుదర్శనశంఖరంజిత
        శ్రీహస్తవర్ణితు శేషశయను
వాసవప్రముఖామరవంద్యచరణుఁ
దులసికాదామసంలగ్నలలితకంఠుఁ
దన్మనఃపద్మకర్ణికాంతర నివిష్ణుఁ
దలఁచునది ధ్యానయోగంబు ధరణినాథ.

112


క.

ఏవంవిధలక్షణముల
భావితుఁడై మదనకోటిభాసురుఁడగు నా
శ్రీవల్లభునిఁ దలంపుము
భావసరోజంబునందుఁ బార్థివముఖ్యా.

113