పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

బసవపురాణము


కృతజ్ఞత

దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు తాళపత్ర ప్రతులపాఠములను సేకరించుటలో మిక్కిలి వ్యయమునకుఁ బాల్పడిరి. మఱియు నేను దఱచుగా మద్రాసులో నుండకపోవుట మొదలగు కారణములచే గ్రంథముద్రణమునకుఁ జాలఁగాలము పట్టినను సైఁచిరి. ఆంధ్రదేశోపకార కార్యములెన్నేని వారి హస్తముననుండి యవతరించుచున్నవి. 'ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్' అన్నసూక్తికిఁ దార్కాణమైనవారు శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు చెన్నపురి చిత్రవస్తు ప్రదర్శనశాలలో సేకరమైయున్న శైవాచార్య శిలాచిత్రమునకుఁ జక్కఁగాఁ బ్రతిబింబము నెత్తియిచ్చిరి. మైసూరు వాస్తవ్యులగు శ్రీ బి. బసవారాధ్య బి. యె;బి.యెల్. గారు బసవపురాణము మొదలగు కర్ణాట గ్రంథముల నేతద్ గ్రంథముద్రణము ముగియుదాఁక మాకెరవుగా నొసఁగి యెంతయు నుపకరించిరి. భారతీ కార్యనిర్వాహకులును, నందును, శ్రీ గన్నవరపు సుబ్బరామయ్యగారును, ఆంధ్ర పత్రికా ముద్రణాలయమున ముద్రణాధికృత ముఖ్యుఁడగు నావుల పార్థసారథినాయఁడు గారును, ముద్రణమున సౌకర్యముగూర్చిరి. వీరికెల్ల గడుఁగృతజ్ఞుఁడను. పీఠికా రచనాదులలోఁగర్ణాటకవి చరిత్రము రెండు సంపుటములును, ప్లీటు దొరగారి బొంబై గెజిటియరును, నాకుఁ బెక్కు విషయముల నెఱిఁగించినవి. అందులకుఁ దత్కర్తలయెడఁగృతజ్ఞుఁడను.

అనేక పాఠభేదములవలని యలజడియుఁ దెకతెంపులేక యేకధారగా నున్న ద్విపదల దీర్ఘగతియు నా యపరిజ్ఞానమును గారణములుకాఁగా నక్కడక్కడ తప్పులు దొరలినవి. వానిని పరిశోధన పత్రమునఁ జేర్చితిని. పునర్ముద్రణమున దిద్దుకొందును. ఇంకను నాకంటి కందనివి యుండవచ్చును. ఎఱిఁగినవారు దెలిపినచో దిద్దుకొందును. ప్రాజ్ఞులకు మ్రొక్కుచున్నాను.

ప్రభవ

వ్యాసపూర్ణిమ.

మదరాసు.

విద్వద్విధేయుఁడు,

వేటూరి ప్రభాకరశాస్త్రి