పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

భారతదేశాన్ని విక్టోరియా మహారాజ్ఞి పరిపాలిస్తున్న రోజుల్లో ఆమె సామ్రాజ్యంలోని మారుమూల ప్రాంతంలో ఒక బాలుడు జన్మించాడు. అది 1895 వ సంవత్సరం. అది మదనపల్లి అనే చిన్న వూరు. పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన చిత్తూరు జిల్లాలో వున్నది. అబ్బాయి తండ్రి తెలుగు బ్రాహ్మణుడు - పేరు జిడ్డు నారాయణయ్య, ఆ జిల్లా రెవెన్యూశాఖలో చిన్న వుద్యోగి. ఆ పిల్లవాడికి కృష్ణమూర్తి అని పేరు పెట్టారు.

అంతకు యాభై సంవత్సరాలకు పూర్వం భారతదేశం లో విద్యావిధానం ఎట్లా వుండాలి అనే విషయం మీద ధామస్ బేబింగ్ టన్ మెకాలే అభిప్రాయాలు ప్రజల్లో చర్చా స్పదంగా తయారయ్యాయి. విద్యా బోధనకి ఇంగ్లీషు భాషే సరైన మాధ్యమం అనీ, పురోగమనానికి అదే ఆదర్శమనీ మెకాలే గట్టిగా విశ్వసించాడు. పందొమ్మిదో శతాబ్దపు భారతదేశాన్ని మధ్యయుగపు ఐరోపాతో పోలుస్తూ నిర్జీవమై పోతున్న సంప్రదాయాన్ని మృతభాషలో నేర్పించడానికి ప్రభుత్వ ధనాన్ని వ్యర్ధం చేయడం సబబేనా అని మెకాలే వుద్రేకంగా ప్రశ్నించేవాడు. భారతదేశంలో విద్యావిధానం ఎట్లా వుండాలి అని నిర్ణయించడానికి మార్గం యింగ్లీషా, సంస్కృతమా - న్యూటనా, టొలెమీయా ఏడం స్మిత్తా, వేదాలా - మిల్టనా, మహాభారతమా - ఆధునికవైద్యమా, ఆయుర్వేదమా - సదా చలనంలో వున్న భూమా, భూమి చుట్టూ తిరుగుతున్న సూర్యుడా అనే ప్రశ్నలకి సమాధానంలో వున్నదని మెకాలే అభిప్రాయం.

ఇండియన్ సివిల్ సర్వీసు ప్రణాళికను రచించినవాడూ, మెకాలే బావమరిది అయిన సి.యి. ట్రెవిల్యాన్ 'చెల్లుకు చెల్లు ' అనే బ్రిటిష్ సామ్రాజ్య రీతిని యిట్లావివరించాడు.

'భారతీయులకు ప్రసాదించడానికి బ్రిటిష్ వారివద్ద వున్నతమైన తమ విజ్ఞానం తప్ప మరొకటేమి లేదు తక్కినవన్నీ పన్నులు మొదలైన ఆర్ధికరాబడులు, గౌరవాలు, వ్యక్తిగత సంపాదనలు మొదలైనవి భారతీయుల వద్ద నుంచి పుచ్చుకున్నా, చివరకు బ్రిటిషువారు తాము పొందిన లాభాల్లో చాలా వాటికి పుష్కలమైన ప్రతిఫలాన్ని తిరిగి యివ్వబోతున్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, భౌతిక వనరులను, సంపదనూ అర్పించుకొని భారతీయులు అందుకు బదులుగా యూరప్ సంస్కృతినీ, పాశ్చాత్య విజ్ఞానాన్ని ముందు కాలంలో అందుకోబోతున్నారు.'