పుట:కాశీఖండము.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

365


స్వరూప యైనకూఁతురు ధూతపాప నదస్వరూపుఁ డైనధర్మునకు వివాహంబు సేసె. గభస్తిమాలి గభస్తీశ్వరుసన్నిధి (మంగళా)గౌరీదేవి నుద్దేశించి మయూఖాదిత్యతీర్థంబున నుగ్రతపం బాచరించిన నతనికిరణంబులవలనం బ్రస్వేదం బుద్భవించి కిరణావతి యనం బాఱె. ధర్మనదంబును ధూతపాప నదియుం గిరణాతరంగిణియు గంగాయమునలుఁ గూడ నైదునదులు పంచనదం బనుపేర పుణ్యతీర్థంబై త్రైలోక్యప్రసిద్ధి గైకొనియె. ఇది పంచనదతీర్ధంబు. ఈతీర్థంబున నాప్లుతుండైనమానవుండు పాంచభౌతికంబైన శరీరంబుఁ బావనంబు సేసి పంచమహాపాతకంబులం బాయు. దివోదాసు నుచ్చాటనంబు సేసి కైటభారాతి పంచనదంబునందు విశ్రమించి యగ్నిబిందుం డను మహామునీంద్రుం డొనర్చు నానావిధస్తోత్రంబులకుఁ బరితుష్టి బొంది యిష్టవరంబు గృప సేసి వెండియు.

115


బిందుమాధవసంభవము

తే.

అగ్నిబిందునిపేరు నిజాహ్వయంబుఁ
గూర్చి మధుకైటభారాతి కూర్మి మిగుల
బిందుమాధవుఁ డనుపేరఁ బేర్మి వడసె
నచ్యుతుఁడు భక్తపరతంత్రుఁ డౌనొ కాఁడొ?

116


వ.

బిందుతీర్థంబునం దుండి యగ్నిబిందునకు గోవిందుం డానందకాననంబునందుఁ దీర్థమాహాత్మ్యకథనప్రసంగంబున దానధర్మవ్రతంబు లనేకంబు లుపదేశించి కరుణావశంవదుం డై యతనిం గనుంగొని యింక నేమి యడిగెద వడుగు మనుటయు.

117