పుట:కాశీఖండము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీఖండము

కవిసార్వభౌముడు శ్రీనాథమహాకవి 'ప్రాయ మింతకు మిగులఁ గై వ్రాలకుండ' రచించిన ప్రౌఢకావ్యము కాశీఖండము. రాజమహేంద్రవరము నేలిన రెడ్డిరాజు వీరభద్రారెడ్డి కంకితముగా క్రీ.శ. 1440 సం॥ ప్రాంతమున రచినమైనది. ఇది స్కాందపురాణమునందలి యేబదిఖండములలోగల సంస్కృత కాశీఖండమునకు అనువాదము. మహాపురాణైకదేశ మగు సంస్కృత కాశీఖండము సులభగ్రాహ్యమై పురాణరీతితో నుండఁగా, తెనుఁగున శ్రీనాథుఁడు ప్రౌఢతరమగు కావ్యశైలిలో దీనిని వచించెను కావుననే “కాశీఖండమయః పిండమ్" అను నాభాణకము తెలుగు కాశీఖండమునుబట్టియే యేర్పడినది.

సంస్కృతమూలమున, ద్వాదళసహస్రగ్రంథపరిమితిగల విషయమును తెలుగున నేడాశ్వాసములును (1-142,2-167, 3-248,4-306,5-399, 6-310, 7-265) 1777 గద్యపద్యములుగల కావ్యమైనది. మూలగ్రంథములోని పౌరాణికవిషయములను, జాతివార్తా చమత్కార విలసితముగను, శైవతత్త్వప్రతిపాదకములుగను శ్రీనాథకవి విపులీకరించి, ఆంధ్రతాముద్ర నీగ్రంథమున నచ్చొత్తినవాఁడు.