పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సారాంశము

కృష్ణాగోదావర్యాది మహానదులచే పవిత్రమగు చుండిన మన నివాసభూమి ప్రాచీనకాలమున 'ప్రాచ్యక^ దేశ మని పిలువబడుచుండెడిది. దాని నొకకాలమున .బలి' యనెడి మహారాజు పాలించియున్నాదు. ప్రాచ్యక దేశము ఉత్తరమున బెంగాలునకు ఉత్తర సరిహద్దునుండి దక్షిణముగా ఇప్పటి మద్రాసునకు దిగువవఱకు వ్యాపించియుండెను. బలిమహారాజు అనంతరము ఆతని కుమారులు ఆరుగురును దాని నాఱుభాగములుచేసి పంచుకొని ఎవరి వాటాకు వచ్చిన భూభాగమును వారు తమ పేరులతో వ్యవహరించుకొని యుండిరి. బలియొక్క కుమారులు 1 అంగరాజు 2 సింగరాజు 3 కళింగరాజు 4 సుంహ్మరాజు 5 పుండ్రరాజు 6 ఆంధ్రరాజు అనెడి పేరులుగలవా రైయుండిరి. వారు తమతమ భాగములకువచ్చిన దేశభాగములకు వరుసగా అంగ దేశమనియు వంగ దేశమనియు కళింగ దేశమనియు సుంహ్మదేశ మనియు పుండ్రదేశ మనియు ఆంధ్ర దేశమనియు పేరులనుంచి పరిపాలించియుండి రని పూర్వ చరిత్రల యందు సూటిగా చెప్పబడియుండగా ఎవరో 'అంధ్ర' లనబడెడి బాహ్యజాతివా రుత్తరదేశమునుండి వచ్చి ఆక్రమించి నివసించి యుండవచ్చుననియు అందువలననే యీదేశమునకు 'ఆంధ్రదేశ' మనుపేరు వచ్చియుండవచ్చు ననియు సందేహముతో గూడిన యీ వికల్పము లేల చేయవలసి వచ్చినదో తెలియరాకున్నది. మన సందేహములకు, వికల్పములకు, కల్పనలకు ఎట్టియవకాశమును లేకుండ భాగవతమునందు ఆంధ్రదేశమున కీపేరెటుల వచ్చినదో సూటిగా చెప్పబడినది. ప్రాచీన ప్రాచ్యక దేశ భాగమే 'ఆంధ్రదేశ' మని పిలువబడినది. అట్టి ఆంధ్రదేశములో అతిపురాతన కాలమునుండి నివసించుచుండిన ప్రజలందరును 'ఆంధ్రు'లని పిలువబడిరి. వారు మాటలాడు తెలుగుభాష కూడ ఆంధ్ర భాష యను నామాంతరమును పొందినది. కనుక 'ఆంధ్రులు' అనబడెడి ప్రజలందరును 'చాతుర్వఋణ్యస్థులును' స్వచ్ఛమైన ఆర్యజాతీయులైయున్నారు.


ఓం తత్ సత్.