పుట:SamardaRamadasu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

మతము - రాజ్యపాలనము

అన్నిటికంటె మొదటిది సర్వశక్తు డగు భగవంతుని పూజ. రెండవది రాజ్యపాలన. మూడవది తక్కిన విషయములలో విరివిగా జ్ఞానముండుట. ఈ విషయములు దాసబోధలో పదునొకండవ అధ్యాయములో నాలుగు, ఐదు శ్లోకముల యందు ఉన్నవి. ఈప్రకరణమునందు రామదాసుని మతము యొక్క మూలసిద్ధాంతములను పాఠక మహాశయులకు గ్రమ క్రమముగా దెలియ బరచుచున్నాము. కాని రామదాసుడు భగవంతుని యవతారపురుషుడు కాడని స్పష్టీకరించుచున్నాము. రామదాసుని జీవితచరిత్ర మహారాష్ట్రభాషలో ననేకులు వ్రాసిరి. కాని వారందఱు మూడవిశ్వాసము గల వారై యా చరిత్రములను ఛాందసముగా వ్రాసిరి. వారందఱు రామదాసు యొక్క సమకాలికులే. వారి వ్రాతలలో రామదాసుడు భగవంతుని యవతారమూర్తి యనియు నందుచేత యనేకాద్భుతములు చేసెననియు వ్రాసిరి. ఆ యద్భుతములు మానవ శరీరములకు సాధ్యమయినవి కావు. ప్రకృతిశాస్త్రము మిక్కిలి యభివృద్ధి చెందిన యీ కాలములో నటువంటి మహిమలు జనులు నమ్మరు. మహాపురుషుల కిట్టి మహిమ లారోపించుట లోకమున నూతన విషయము కాదు. వా రవతార పురుషులని చెప్పుటయు నూతన విషయము కాదు. అద్వైత మత స్థాపకుడైన శంకరాచార్యులు శివుని యవతార మని యద్వైతు లందరు. వైష్ణవ మతోద్ధారకులైన రామానుజుల వారు శేషుని యవతార మని విశిష్టాద్వైతులు నమ్ముదురు. అట్లే మధ్వరాయలవారు వాయుదేవుని యవతారమని ద్వైతుల విశ్వాసము. లింగమత స్థాపకుడైన బసవేశ్వరుడు శివుని వాహనమైన నందియొక్క యవతారమూర్తి యని లింగధారులు దృడముగా నమ్ముదురు. వంగదేశమున వైష్ణవమతము స్థాపించిన చైతన్యస్వామి శ్రీకృష్ణ