పుట:Ranganatha Ramayanamu.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సౌమిత్రి రణపరిశ్రాంతి మాన్చుటకు - నామందవాయువు లల్లన వీచె;5620
అంత లక్ష్మణుఁడు నాయంతకుపగిది - నంతకంతకు నుగ్రుఁడై యింద్రజిత్తు

లక్ష్మణునిచే నింద్రజిత్తు చచ్చుట

నటు చూచి కార్ముకజ్యానినాదంబు - పటుశక్తితో దిశాభాగంబు పగులఁ
జెలఁగించి మెయి పెంచి సింహనాదంబు - సెలఁగించి దేవేంద్రుచేఁ గొన్నయట్టి
యారూఢి మీఱ నింద్రాస్త్రంబు దొడిగి - యారామవిభుఁడు ధర్మాత్ముఁ డౌనేని
దేవి యాసీత పతివ్రతయేని - దేవతాకరుణ నాదెసఁ గల్గెనేని
నింద్రాదులకు నెల్ల హిత మగునేని - నింద్రజిత్తునితల యిమ్మహాశరము
త్రెంచుఁ గావుత! మని దృష్టి సంధించి - మించి యేయుటయును మి న్నెల్ల నిండి
పృథుదీర్ఘనిర్ఘాతభీషణం బగుచుఁ - బ్రథనవికాసనప్రారంభ మగుచు
బహురత్నపుంఖశోభాయితం బగుచు - విహగేంద్రసమజనావిర్భావ మగుచు
నహిముఖానలకణాత్యాలోల మగుచు - నహిమాంశుబింబప్రభాభీల మగుచు5630
మండుచు రుచులతో మహియు నాకసము - నిండుచు నత్యుగ్రనిగ్రహోదగ్ర
గతులమైఁ బఱచి రాక్షసలోకనాథు - సుతుఁ గిట్టి యందంద సురలు మిన్నంద
దనరిన నమ్మహోద్దండాస్త్ర మతని - యనుపమమణికుండలాంచితం బైన
లలితారుణేక్షణాలంకృతం బైన - తల బొమిడికముతో ధరఁ గూలఁద్రోసెఁ;
గలుషభావమున లంకానిధానంబు - చలమున నుగ్రుఁడై సాధింపఁ గోరి
బలి యిచ్చుకొఱకునై పటులులాయంబు - దల ద్రుంచి వైచువిధం బచ్చుపడగ
ననిలోనఁ బడియున్న యాయింద్రజిత్తుఁ - గనుఁగొని జయలక్ష్మి గైకొని దిశలు
గలయంగ నపుడు శంఖంబు పూరించి - విలు గుణధ్వని చేసి వెస లక్ష్మణుండు
నలి నప్పు డురుసింహనాదంబు సేసెఁ - జెలువొంద నప్సరస్త్రీల లాస్యములు
వీనుల సొలయించె; విశ్రుతశ్రుతుల - మానైన గంధర్వమధురగానములు;5640
అంత విభీషణుం డంతంత కెచ్చు - సంతోషమునఁ గ్రుచ్చి సౌమిత్రి నెత్తి
యాలింగనము సేసె నాలంబులోన - నాలోన వనచరు లందంద చెలఁగి;
రంతలో హతశేషు లగునిశాచరులు - నెంతయు భీతిల్లి యేపెల్లఁ బాసి
వనచరుల్ దోలంగ వడి ధృతు ల్గూల - దనరారుపదహతి ధరణి గంపింపఁ
గలఁగొని చీఁకట్లు కన్నులఁ గవియఁ - దలలు వీడఁగ నాయుధంబులు వైచి
చెందినభయమునఁ జెడి పాఱి లంకఁ - గొందఱు చొచ్చిరి, కుధరశృంగములు
కొంద ఱెక్కిరి; వార్ధిఁ గొందఱు పడిరి - కొందఱు దూరిరి గుహనికుంజములు
అనలుండు తీవ్రార్చు లడరంగ వెలిఁగె - దినకరుం డుజ్జ్వలదీప్తిఁ జెన్నొందె;
జలము లెందును నతిస్వచ్ఛంబు లయ్యెఁ; - గలయ దిక్కుల కప్పుకావిరి విఱిసె;
గగనప్రసన్నత గలిగె నిష్కంప - మగుచు భూతల మొప్పె; నప్పు డెంతయును5650