పుట:Neti-Kalapu-Kavitvam.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


(పై వాదం సరిగాదు)

ఈ దృష్టాంతం యుక్తమేను సామ్యానికి విషమైన వివక్షితాంశం వున్నది. దృష్టాంతదార్ప్టాంతికల్లో వివక్షితమైన కొంత సాదృశ్యంతప్ప సర్వసాదృశ్యం నిరూపించడానికి యెవరికి సాధ్యంగాదు. సర్వసారూప్యమే చెప్పుతామా దృష్టాంత దార్ప్టాంతికభావమే పోతుంది. జలగతమైన సూర్యబింబంజలం హెచ్చితే హెచ్చుతుంది. జలం తగ్గితే తగ్గుతుంది. జలం కదిలితే కదులుతుంది. జలం భేదిస్తే భేదిస్తుంది. ఈతీరుగా సూర్యుడు జలధర్మాలను పొందుతాడు. కాని నిజానికి సూర్యుడికి జలసంబంధి వృద్ధిహ్రాసాదులు లేవు. అట్లానే వాస్తవానికి ఆత్మ అవికృతం యేకరూపం అయినప్పటికీ దేహాధ్యుసాధయంతర్భావంవల్ల ఉపాది ధర్మాలైన వృద్ది హ్రాసా దులను పొందినట్లు కనబడుతుంది (ఈ వృద్ది హ్రాసభాక్త్వమే సూర్యుడికి ఆత్మకు సాదృశ్యంలో వివక్షితాంశం. ఈతీరుగా దృష్టాంత దార్ప్టాంతికాలు సమంజసమై ఆవిరుద్ధంగావున్నవి) అని శ్రీశంకరభగవత్పాదులు విశదీకరించారు. ఇంతకూ వివక్షితాంశమేమంటే కావ్యం కాంతవంటిదన్నప్పుడు సరసత్వా పాదనంచేత శ్రోతను అభిముఖుణ్ణి చెయ్యడం మట్టుకే సాదృశ్యంగాని అసాదృశ్యాన్ని అంతటా అన్వయించి కాంతవలె కావ్యమంతా మెత్తమెత్తగావుంటుందనీ అందువల్ల కావ్యం అంతటా విశ్వమోహనం ప్రణయం శిరీషం చిరు సోనలు జింకపడతి యిట్లాటి మెత్తటి అర్ధాల మెత్తమెత్తటిమాటలతో నిండివుండవలెననీ అనడం అప్రశస్తమని చెప్పుతున్నాను.

ఆక్షేపం

అవునయ్యా మీరన్నట్లు సర్వసాదృశ్యం అవసరంకాకుంటే కాకపోనీయండి సరసత్వాపాదనంచేత అభిముఖీకరణం సాదృశ్యంలో వివక్షితాంశమంటే మేమొప్పుకోము. ప్రణయం మృదులం, విశ్వమోహనం కన్నెలేడి యిట్లాటి మెత్తటి మాటలు వుండడమే కాంతా కావ్యాలకు సాదృశ్యంలో వివక్షితాంశ మంటాము. అని వాదిస్తారా?