పుట:Narayana Rao Novel.djvu/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

‘పిల్లలంటే ప్రాణం’

269

దక్షిణదేశమున జిల్లా వైద్యశాలలో నుపవైద్యులుగా నున్నప్పుడు, మైసూరు దేశపు వైష్ణవ వితంతు బాలికను బ్రహ్మసమాజ పద్ధతిని వివాహమాడెను. ఉద్యోగము విరమించి తన భార్య గ్రామమగు మంగుళూరులో నామెకు సంక్రమించిన మేడలో నుండినాడు. ఆయనకు నలుగురు కొమరితలు, నలుగురు కుమారులు జనించినారు. కుమారులలో బెద్దవాండ్రు ముగ్గురు విదేశములకు బోయినారు. పెద్దకుమారుడు ఇంజనీరింగులో నుత్తమవిద్య బడసి కాశీ హిందూ విశ్వవిద్యాలయములో నాచార్యుడుగ నున్నాడు. రెండవ కుమారుడు ఇంగ్లండులో వైద్యవిద్య నభ్యసించి ఇప్పుడు దక్షిణార్కాటుజిల్లాలో జిల్లా వైద్యుడుగా బనిచేయుచున్నాడు.

మూడవ కుమారుడు జర్మనీలో కర్మాగారవిద్య బడయుచున్నాడు. నాలుగవ కుమారుడు చెన్నపురిలోనే చదువుకొనుచున్నాడు.

ఆంధ్రులు పూర్వకాలమున వివిధదేశములకు వలసబోయినారు. విదేశములతో ఓడబేరము సలిపినారు. దేశముల జయించినారు. క్రీస్తుపుట్టినపిమ్మట నయిదారు శతాబ్దులలో కొందఱాంధ్ర బ్రాహ్మణులు మళయాళదేశమునకు బోయి నంబూద్రీలయినారు. తంజావూరు, మధుర నాయకుల కాలములో దక్షిణాపథమునకు తెలుగు బ్రాహ్మణులు, నాయకులు, కమ్మవారు వలసబోయినారు. హైదరాబాదు పరిసరముల నుండి కొందఱు బొంబాయి కరిగి యచ్చట వృద్ధినొంది, కామాఠీలని పిలువబడుచున్నారు. తరువాత నాగపురము, కళ్యాణి, అహమ్మదాబాదు, జబ్బలుపురము, కలకత్తా, కాశీ, ప్రయాగాది ప్రదేశముల నాంధ్రు లుద్యోగవర్తకాదులకైపోయి యచ్చటనే నిలిచిపోయినారు. ఇంటిలో దెలుగు మాట్లాడుకొందురు. పైకి వచ్చినప్పుడే ఆ దేశభాష మాట్లాడుకొందురు.

అటులనే గోపాలకృష్ణయ్యగారి పూర్వీకు లెప్పుడు మైనూరువచ్చినారో తెలియదు. గోపాలకృష్ణయ్యగారి భార్య అయ్యంగారి యువతియైనను నామెకు దెలుగు బాగుగా వచ్చుటచే భర్త యిష్టము ప్రకారము బిడ్డలందరకు దెలుగు నేర్పినది. కావుననే శ్యామసుందరీదేవి కుటుంబమువారందరికి తెలుగు, అరవము, కన్నడము బాగుగవచ్చును. హిందూదేశమున మైసూరు వైష్ణవులు సౌందర్యములో రెండవవారని ప్రసిద్దినందినారు. నాజూకుతనము, జ్ఞానము, సౌందర్యము కలిగియు త్రివేణీసంగమములో వారే యఖిలభారతదేశమునకు బ్రథమ పీఠము వహింపగలవారు. అట్టి తల్లికిని, తెలుగు తండ్రికిని జనించిన శ్యామసుందరి మొదలగు నాబాలికలందరు నందమున భారతీయ రాణు లనదగినవారు.

ఆంధ్రదేశ మొకనాడు బెంగాలు పంజాబు దేశములవలె సంఘసంస్కరణోద్యమములో నిలబడి పేరువహించినది.

ఒకనాడు పరమేశ్వరమూర్తి, ఆలం, రాజారావు, వారి యరవస్నేహితుడగు నటరాజన్ శ్యామసుందరి యింట జేరినారు. నారాయణరావింక నచ్చటికి