రై లు కూ డా త థా స్త న్న ది
9
నారాయణరావు చిరునవ్వుతో ‘మరి నేనేమి సామాన్యుడ ననుకున్నావుటరా! నేను కూడా ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చాను’ అనెను.
రాజా: నువ్వు పెటగోనియనువురా బాబూ! సామాన్యుడ వెందుకవుతావు?
రాజే: నీ గోత్రం కూడా అడిగాడు రా! ఎందుకో?
నారా: పెటగోనియనులకు గోత్రము ఉండదనుకున్నాడేమో?
రాజే: లక్ష్మీపతి చెప్పాడు, మీది కౌండిన్యసగోత్రమని.
ఆలం: కాదురా భాయి. ఆయన నీకీ నిఖ్కా సేస్తాడు రా.
నారా: నీ మొఖం, ఆయన సాయిబు గాదురా, మొగాడికి నిఖ్కా చేయడమా!
రాజే: అవునురోయి! ఆయనకో కూతురుందిరా. ఆ పిల్ల కింకా పెళ్ళి కాలేదు. నిజమే.
పర: ఇక నేమి! నారాయుడి రొట్టె నేతిలో పడింది.
రాజా: నారాయుడి రొట్టెకాదు, నాదీని. నేనింక హిజ్ హైనెస్ విశ్వలాపురం జమీందారుగారికి స్టేటు డాక్టర్నవుతాను.
రాజే: ఒరే బాబూ! నారాయుడు! నన్ను కూడా కాస్త కని పెట్టి ఉండాలిరా. మామగారికి సిఫార్సుచేసి నన్నుకూడా స్టేటు ఇంజనీరుగా పారేయించు.
నారా: ఏడిశారులే వెధవల్లారా! మీలో ఒకడూ ఇంకా పరీక్షకైనా కూర్చోలేదు. అప్పుడే ఉద్యోగాలు! మామగారి యెస్టేటులో మిమల్నెవళ్లనీ అడుగైనా పెట్టనివ్వను, ఒక్క పరమేశ్వరుణ్ణిమట్టుకు ఆస్థానకవిని చేస్తాను.
రాజే: సెబాస్! చూస్తావేమిరా ఇంకా, పరమేశ్వరుడూ! ఏదీ రాజ జామాతమీద ఒక కీర్తన పాడరా!
పరమేశ్వరమూర్తి లేచినిలిచి ఆశీర్వచనముద్ర పట్టి గొంతు సవరించు కొంటూవుండగా, రాజేశ్వరరావు ‘ఆగరా పరమాయి! మరచిపోయాను. బంగారపు బొమ్మ, పచ్చకర్పూరపు బరిణలాంటి పెళ్ళికూతుర్ని విడిచిపెట్టి, యీ మొరటు నారాయుడిమీద పాటపాడటానికి వల్లగాదు. చేయరా, ముందు వధుకీర్తనం చేయి’ అన్నాడు.
‘అచ్చా! సభవారి అనుజ్ఞా?’ అని అడిగి పరమేశ్వరమూర్తి,
‘యెంకివంటి పిల్ల లేదోయి, లేదోయి!
యెంకి నావం కింక రాదోయి, రాదోయి!’
అని పాడునప్పటికి రాజారావు, ‘చాల్లేవోయ్, నీ అశుభప్పాటలు’ అని వారించినాడు. పరమేశ్వరుడు తెల్లబోయి,
‘నీతోటె ఉంటాను నాయుడు బావా!
నీమాటె యింటాను నాయుడు బావా!’
అని అందుకున్నాడు.