పుట:Narayana Rao Novel.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

నా రా య ణ రా వు


‘బాగుందిరా. ‘మంగళాంతాని కావ్యాని’ అన్నారు. తథాస్తు అనండోయి సభవారు’ అన్నాడు రాజారావు.

సభవారితోపాటు రైలుబండికూడ ‘తథాస్తు’ అన్నట్లుగా కూత కూసినది. గార్డుకూడ ఈల వేసి జెండాతోడి చేయెత్తి దీవించినాడు. సమయానికి ఊడిపడినట్లుగా జమీందారుగూడా పరుగుపరుగున వచ్చి బండిలో నెక్కినాడు.

కేకిసలు కొట్టుచున్న మన మిత్రులందఱు నదరుపాటుగ గనులప్పగించి చూచుచుండ, రాజేశ్వరరావు లేచి నిలిచి ‘దయ చేయండి, దయ చేయండి’ అంటూ చోటు చేసినాడు. జమీందారు గారు కూరుచుండి ‘నాబోటి వృద్ధులు చెదలుపట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మీవంటి పడుచు వాళ్ళతో సావాసం చెయ్యాలి. మిమ్మందఱిని చూస్తే నాకు తిరిగి యౌవనం వచ్చినట్లుగా ఉంది. మీరంతా ఒక్కసారిగా బయల్దేరారు, అందరూ ఒక కాలేజీలోనే చదువుతున్నారు కాబోలు. రాజేశ్వరరావుగారు మా ఊరివాడు కావడంచేత నే నెఱుగుదును. తక్కిన అందరూకూడా రాజమండ్రికేనా? ఇంకా పైకి పోయేవారా?’ అన్నారు.

రాజే: లేదండీ, అందరూ తలో ఊరి వాళ్ళూ, తలో కాలేజీ వాళ్ళూను. ఇదిగో, మా నారాయుడు ఎఫ్. ఎల్. పరీక్షకు వెళ్ళాడు. ఆలంసాహెబు కూడా ఎఫ్. ఎల్. కే వెళ్ళాడు. ఆతడు రాజారావని, వేమూరివారు. వారిది కాకినాడ. ఆతను ఎమ్. బి., బి. ఎస్. నాల్గోయేటి పరీక్షకు హాజరైనాడు. అడుగో అతడు పరమేశ్వరమూర్తి, వాడ్రేవువారి చిన్నవాడు. ఆయన గ్రాడ్యుయేటు. కవి, చిత్రకారుడు, గాయకుడూను. ఇందాక మీకు కనిపించిన లక్ష్మీపతిది నిడమర్రు. ఇంటిపేరు నిడమర్తి వారే. ఆయన మా నారాయుడి బావగారు. ప్రైవేటుగా ఎఫ్. ఎ. పరీక్షకు హాజరైనారు. ఒక్క లక్ష్మీపతి తప్ప తక్కిన అందరమూ ఒక్కసారే రాజమండ్రిలో ఇంటరు చదివాము.

లక్ష్మీ: రాజేశ్వరరావునాయుడు గారు మీకు తెలిసిన వారే కదండి. బి. ఇ. పరీక్షకు హాజరైనాడు. చాల సంపన్న గృహస్థుడూ, సరసుడూనూ.

జమీం: సరి సరి. ఆయన్ని నేను ఇంత నాటినుంచీ యెఱుగుదును. కాలేజీలు మూసి చాలారోజు లైనట్లుంది, ఇంత ఆలస్యంగా బయలుదేరినారేమి?

ఆలం: రాజారావు పరీక్షలు మొన్ననే ఆఖరైనాయండి. అందుకోసం మేమంతా మరి నాల్గుదినాలు నిలిచి ఏవో సినిమాలతో కాలక్షేపంచేసి బయల్దేరాము.

జమీం: తక్కిన పరీక్షల్లో ఎట్లాఉన్నా, మనవాళ్ళు లా కాలేజీలో చాలా మేటిలనిపించుకొంటున్నారు..

రాజే: మా నారాయణ రావు ‘లా’ ఆత్మవికాసానికి పరమశత్రువంటాడు.

జమీం: ఏమండీ నారాయణరావు గారూ! అయితే మీరు గాంధీ మతస్థులా?