పుట:Naa Kalam - Naa Galam.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగుకు ప్రాచీన అధికార భాషా ప్రతిపత్తి :

2003 మే 9వ తేదీన తమిళనాయకులు మూకుమ్మడిగా, ఉన్నట్టుండి ఒక బాంబుపేల్చారు! తమిళ భాష భారతీయ భాషలలో అతిప్రాచీనమైనదట! కావచ్చు, అందువల్ల, ఆ భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వవలెనట ! అంతవరకైతే ఫర్వాలేదు. తమ తమిళ భాషను దేశ స్థాయిలో హిందీ తరువాత రెండవ అధికార భాష చేయాలట! అందుకు అన్ని విధాల అర్హతలు తమ భాషకే ఉన్నవట!

ఈ కోర్కెలతో 2003 మే 9వ తేదీన తమిళ రాజకీయ పక్షాల నాయకులందరు అప్పటి కేంద్రమంత్రి శ్రీటి.ఆర్‌. బాలు నాయకత్వాన ఆనాటి భారత ప్రధాని శ్రీ వాజ్‌ పేయిని కలిసి ఒక మెమోరాండం సమర్పించారు.

ఈ వార్త 2003 మే 10వ తేదీన "హిందూ" దినపత్రికలో ప్రచురించబడింది. ఈ వార్త చూచిన వెంటనే నేను తీవ్రంగా ప్రతిస్పందించాను. వెంటనే ప్రధాని వాజ్‌పేయికి సుదీర్ఘమైన టెలిగ్రామ్‌ పంపించాను. తమిళానికి ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వడానికి ఎవ్వరికీ అభ్యంతరం ఉండనక్కరలేదని, అయితే, ఆ అర్హతకు తగిన ప్రాచీనత, భాషాపరిపుష్టి, చరిత్ర తెలుగు భాషకు కలవని, వీటిలో తెలుగు ఏ భాషకు తీసిపోదని పేర్కొన్నాను.

అంతేకాదు, హిందీ తరువాత దేశస్థాయిలో రెండవ అధికార భాష కాదగిన అర్హత ఒక్క తెలుగుకు మాత్రమే ఉన్నదని, ఈ విషయంలో తెలుగును పక్కన పెట్టడం అక్రమం, అన్యాయం కాగలవని కూడా ఆ టెలిగ్రామ్‌లో హెచ్చరించాను.

ఈ విషయాలన్నింటిని ఒక లేఖ ద్వారా విపులీకరిస్తూ ప్రధాని దృష్టికి తీసుకువచ్చాను. దేశ, విదేశ ప్రముఖులు నికొలాయ్ కోంటి (ఇటలీ),