పాడుచుండు వారిపాట వీధులలో మూగియుండిన జనులకు సయితము వినవచ్చుచుండెను. చెన్నపట్టణమునకు వచ్చినపుడెల్ల వేలకొలది ద్రవ్యము ఆయన మూటగట్టుకొనిపోవుచుండెను. ఆయన కొంచెము పొట్టిగానున్నను స్ఫురద్రూపముగలిగి పవిత్ర చరిత్రముగలవాడని పేరుచెందెను. వారిపేరు జ్ఞాపకముచాలదు. ఏదో వాధ్యాయరు అని పిలిచెడివారు. మరియు ఏనాదిపిల్ల లను ఇరువురుస్త్రీలు పాటకచ్చేరీలలో మిక్కిలి హృద్యముగ పాడి పలువురచే మెప్పుగాంచుచుండిరి. వీరు పేరుకు పిల్లలుగాని వయస్సున యువతులే. పిమ్మటికాలములో పట్టణము సుబ్రహ్మణ్యము అయ్యరుగారిపాట ప్రఖ్యాతముగ చెప్పుకొనుచుండిరి. వారిపాట నేను వినుట సంభవించలేదు.
జావళులను కొందరు సంగీతపాటకులు పాడుచుండెడివారు గాని అవి సాధారణముగ గొప్పపేరు పొందినవిద్వాంసులు పాడుట లేదు. జావళీలలో కొన్ని అశ్లీలములుగా నుండునవిగాన నానాట వానిప్రచారము దేశమున తగ్గిపోయినది. త్యాగరాజకృతులే విశేషముగ ఖ్యాతిగాంచినవి. త్యాగరాజు తెలుగువాడయ్యు అరవదేశమున బుట్టి అక్కడనే ఈకృతులను వ్రాసి ప్రచారము గావించియుండుటచేత మహావిద్వాంసులు వారికృతులనే ముఖ్యముగ పాడుచుండిరి. తెలుగుదేశమున మువ్వగోపాలపదములు మొదలగువానిని భోగముమేళములలో పాడుచుండిరి. కాని త్యాగరాజకృతులుపాడుట మనవారికెవ్వరికిని ఆకాలమున అభ్యాసములేకుండెనని చెప్పవచ్చును. నేనెఱిగినంతలో గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలలో ప్రథమమున కృతులుపాడినవారు జంగం