పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బందరో, రాజమహేంద్రవరమో, చెన్నపట్టణమో పోవలసి యుండెను. చెన్నపట్టణములో క్రైస్తవకళాశాల ప్రసిద్ధమైనదిగా చెప్పబడుచుండెను. ఆకళాశాలలో చేరి చదువవలెనని కుతూహలము హెచ్చుగానుండెను. కాని, చెన్నపట్టణము చాలదూరమగుటచేతను, ఆకాలమున రైళ్లు లేవు గనుకను అచ్చటికి బోవుట చాలప్రయాసగా నుండెను. పెద్దపట్న వాసమగుటచే ఖర్చులును హెచ్చుగానుండునను కారణముచేత మాతండ్రిగారికి చెన్నపురికి పంపుట కిష్టములేకుండెను. యూలుదొరగారు చెన్నపట్టణములో క్రైస్తవకళాశాలకు బోయి చదువవలెననియు, అట్లయిన నెలకు పదిరూపాయలు ఉపకారవేతనము ఆకళాశాలవా రిచ్చునట్లు సిఫారసుచేసెదననియు గట్టిగా చెప్పుచుండెను. నాకు అంతవరకు మిషన్‌స్కూలులో జీతముఇచ్చుట అవసరములేకుండ ఉపకారవేతనము బహుమానముగా నియ్యబడుచుండెను. పుస్తకములకు దప్ప మరి ఏమియు నావిద్యకై ఖర్చులుపెట్టవలసిన ఆవశ్యకము లేకుండెను. చెన్నపట్టణము కాలేజిలోగూడ ఉపకారవేతనము లభించుట మేలుగనేయుండునుగాని నాకు క్రైస్తవమతాభిమానము వలన లోగడ నడచినకథ గమనించి మాతండ్రిగారు క్రైస్తవ కళాశాలకు నన్ను బంపుటకు బొత్తుగా సమ్మతించకుండిరి. చివరకు రాజమహేంద్రవరము బోవుటకే నిశ్చయించుకొంటిని. హనుమంతరావు అక్కడికే సిద్ధమయ్యెను. కాబట్టి ఉభయులము కలసి రాజమహేంద్రవరము బోయి అక్కడ గవర్నమెంటు కళాశాలలో యఫ్. ఏ., తరగతిలో ప్రవేశించితిమి. మెట్‌కాఫ్. యమ్. ఏ., అను ఆంగ్లేయవిద్యాపండితుడు ఆకళాశాలకు ప్రిన్సిపాల్‌గానుండి ప్రసిద్ధిగాంచెను. ఆయన రూపమున నొడ్డుపొడవు