మూడవనాడు వారియొద్దకు బోయి, నామనస్సున కలిగినమార్పు స్పష్టముగ చెప్పివేయుటయే యుక్తమని వారియింటికి వెళ్లితిని. నిన్న నేల రాలేదని వారు నన్నుప్రశ్నించిరి. జరిగినవిషయములను మనవిచేసితిని. అదంతయు శాంతముగా విని "మంచిది నీవు క్రైస్తవుడవు గాకపోయినను మంచిహిందువుగా నుండు" "Be a good Hindu" మని నాకు ప్రేమతో హితోపదేశము గావించిరి. అప్పుడు నిజమైన ఆయనగొప్పతనము నాకు మరింత విస్పష్టమయ్యెను. ఆ శాంతమును, ఆఉదారభావమును ఆయనపై నాప్రేమగౌరవముల వేయిరెట్లు హెచ్చుగావించెను. మానవులలో నిట్టిమహాపురుషులు అరుదనియు ఆదర్శప్రాయులనియు యెప్పుడును తలంచుచుంటిని.
ఎఫ్. ఏ. చదువు
అంతట కొలది దినములకే పరీక్షాఫలితములు తెలియవచ్చెను. నేనును నామిత్రులు పలువురును కృతార్థులమైతిమని ఊరంతట చెప్పుకొనుచుండిరి. ఆనాడు మెట్రిక్యులేషనుపరీక్షలో ఉత్తీర్ణులగుట మిక్కిలి అపరూపముగ తలంచుచుండిరి. సుమారు ఇరువదివేలజనులతోగూడిన గుంటూరుప్రజలలో మాయశస్సుప్రాకిపోయెను. హనుమంతురావు ఒక్కడుమాత్రము ఫస్టుక్లాసులో ఉత్తీర్ణుడయ్యెను. పరీక్షాఫలితములు తెలిసినపిమ్మట యఫ్. ఏ., పరీక్షకుగూడ చదువవలెననియే నాకు ఉత్సాహముండెను. మా తండ్రిగారు భారమువహించుట కష్టమని కొంత సంశయించెను. కాని తుదకు సమ్మతించెను. గుంటూరులో కాలేజి లేదుకాబట్టి