ఇంతకుమించిన ఆదాయము రాబట్టుటకు అవకాశములేదు. కాబట్టి వ్యవసాయము ఎత్తివేసి భూమిని ఇతరులకు కవులు కిచ్చి ఎక్కడనైన నుద్యోగము సంపాదించుకొని జీవించుట యుక్తము" అని యోచించి, వ్యవసాయము ఎత్తివేయుటకు నిశ్చయించుకొనెను. భూమిని సాలుకు రు 32 లకు మక్తాయిచ్చులాగున ఒక ఆసామికి కవులుకిచ్చి, ఉద్యోగము నిమిత్తము ప్రయత్నము సాగించెను. మా ఇంటికి దాపుననే సర్వే డిపార్టుమెంటులో ఉద్యోగిని ఆశ్రయించగా నుద్యోగ మిప్పించెదనని వాక్రుచ్చెను గాని తుదకు ఆయన సహాయము చేయలేకపోయెను. ఇప్పుడు వైశ్యులని పిలువబడువారు నాడు కోమట్లని పిలువబడుచుండిరి. వారు బ్రాహ్మణులయందు హెచ్చుగా భక్తివిశ్వాసములు గలిగియుండిరి. వారియొద్ద గుమాస్తాగా ప్రవేశించినవారు నమ్మస్తులైన యెడల మిక్కిలి గౌరవము చూపుచుండిరి. కనుక ఒక కోమటివారి కొట్లో మా తండ్రిగారు ప్రవేశించిరి. కాలము గడచిన కొలది మా నాయనగారియందు మిక్కిలి గౌరవము చూపుచు వారి కొట్లో అమ్మకమైన సరుకులోనుండి గుమాస్తాగారి భాగమని కొంచెము సరుకు తీసి వేరుగా పెట్టుచుండిరి. అట్లు వేరుపరచిన సరుకులు మా తండ్రిగారింటికి తెచ్చుటచేత యింటిలో పలువిధములయిన సరుకులు కొఱతలేకుండ నుండెను. గుమాస్తాగిరిలో ప్రవేశించిన పిదప కుటుంబవ్యయములకు కొదువలేకుండ చేతిలో డబ్బు మెలగుచుండెను. తెచ్చినడబ్బు తల్లిగారి కిచ్చెడివారట. పెట్టి బేడలు ఏమియు లేకపోవుటచే నొక గూటిలో ఆమె దాచి పెట్టుచుండెను. ఇట్లు జరుగుచుండగా మా తండ్రిగారికి వివా