ఆంధ్రోద్యమ ప్రచారము
1914, 1915 సంవత్సరములలో నా వృత్తివ్యాపారము సాగించుకొనుచు అప్పుడప్పుడు తీరికచేసుకొని ఆంధ్రదేశమున సంచారముగావించుచుంటిని. 1913లో బాపట్లమహాసభ జరిగిన పిమ్మట నేను మహానందిలో విద్యార్థుల మహాసభ జరుగునని విని న్యాపతి హనుమంతురావుపంతులుగారితో కలసి అచటికి వెళ్ళితిని. ఆమహాసభకు శ్రీ కేశవపిళ్ళెగారు అధ్యక్షత వహించిరి. అట్టిమహాసభ రాయలసీమలో అపురూపమైనదే. రాయల సీమజిల్లాలనుండి విద్యార్థులుమాత్రమేగాక పలువురు ప్రముఖులు గూడ విచ్చేసిరి. సభాకార్యక్రమము జరుగుచుండగనే నేను అధ్యక్షుల అనుమతి పొంది ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునుగూర్చి యుపన్యసించుచుండగా శ్రీ కేశవపిళ్ళెగారు "నేను అరవ వాడనా, తెలుగువాడనా"యని ప్రశ్నించెను. మీరు తప్పక ఆంధ్రులేయని ప్రత్యుత్తరమిచ్చుచు పుట్టుకచే అరవవారైనను ఆంధ్రదేశమున మీవృత్తిని సాగించి, స్థిరనివాస మేర్పరచుకొని ఆంధ్రులకై పాటుపడుచు వారిలో ఐక్యమైనారుగావున మీరు ముమ్మాటికిని ఆంధ్రులే యని స్పష్టీకరించితిని. అందుమీద సభలో జయధ్వానములు చెలరేగెను.
మాహానందిలో స్నాము మహదానందము కల్పించెను. మహానందీశ్వరునిదేవాలయ మొక అరణ్యప్రదేశములో నున్నది. ఊరుగాని పల్లెగాని లేదు. పర్వదినములలో యాత్రికులుతప్ప ఇతరసమయములలో మనుష్యసంచార ముండదు. రాత్రివేళ