పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బూరాలు ఊదారు
ఏడుకలూ పెళ్ళి ఏడుకలూ
పడవెక్కి తెడ్డేసి
నడిసముద్రాన్ని చేరి
ఆలిచిప్పల మద్దె ముత్యాల జాలరులు
ఏడుకలూ పెళ్ళి ఏడుకలూ”

అని తల్లితోపాటు చేపలు ఎండవేసేటప్పుడుగాని, అయ్య యిచ్చిన చేపల్ని బుట్టలో తీసుకొనివచ్చి అమ్మకు అందిచ్చేటప్పుడుగాని, సన్నటి రొయ్యపప్పు రంగూన్ యెగుమతి కోసం తండ్రితోపోయి బుట్టలలో కట్టేటప్పుడుగాని, వెన్నెల రాత్రుల ఒడ్డుకు తేలుకుంటూ వచ్చి పాటపాడేటి ఉప్పునీటి కెరటాలతో కలిపిగాని ఆమె గొంతెత్తి ఎన్నో పాటలు పాడుతూ ఉండేది. ఆ పల్లెవాళ్ళ వేడుకలలో, ఉత్సవాలలో పద్దమ్మ పాడకపోతే అవన్నీ పరిమళాలులేని పువ్వులులా అయిపోయేవి. అడవి పువ్వులకు దోహదాలు కావాలా అందమైన సువాసనలను వెదజల్లడానికి! కావలిలో ఆ బాలిక గొంతు విని ప్రయివేటు మాష్టరు “ఏమండీ వెంకట్రావుగారు! మీ వాళ్ళకు సంగీతం చెప్పించండి” అని ప్రోత్సహించాడు. అప్పుడే పద్మావతి జీవితములో నరసింహమూర్తి మేష్టారు ప్రవేశించాడు.

సముద్రపు ఒడ్డున పాలసముద్రపు కెరటాలులా ఉబికి ఉన్న ఆ ఇసుక తిన్నెలలో ఆటలాడుకుంటూ, నత్తగుల్లలు ఏరుతూ, శంఖాలు ప్రోగుచేసుకుంటూ, రంగురంగుల పీతల్ని తరుముతూ కూరకు పనికివచ్చే పెద్ద పీతల జోలికి పోకుండా ఆటలాడుకునే పల్లె బాలికలకు ఆ సముద్రం అవతల ఒడ్డున ఏమున్నదో ఏమి తెలుసు? కెరటాలు ఎందుకు పుడతాయో వాళ్ళు ఆలోచిస్తారు. సముద్రపు లోయల్లో ఏ రాక్షసో నిట్టూర్పులు విడుస్తూవుంటే ఆ కెరటాలు ఏర్పడుతాయేమో? ఉతుకు ఎరుగని పేలికలైన పరికిణీ చొక్కాలు ధరించి మహారాజు కుమార్తెలా గంతులువేస్తూ ఆడుకొనే పద్దాలుకు, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, సముద్రానికి ఇవతల ఒడ్డు అవతల ఒడ్డు సముద్రుని పోటుపాటూ, సముద్రుని పెండ్లాము నదీసుందరి రాకపోక, తోలుబొమ్మల ఆటలులా జరిగిపోయేవి.

ఎందుకు అందమైన బట్టలు కట్టుకోవాలో తెలియకపోయినా రంగురంగుల కొత్త పరికిణీలు చక్కని వల్లెవాటులను, చుక్కచుక్కల రవికెలు కావాలని చిన్నతనంనుంచీ వాంఛించేది పద్దాలు.

పెద్దవాళ్ళ యిళ్ళలో తిండికోసము ఏమి వండుకుంటారో అని పద్దాలు ఎప్పుడూ ఊహించుకోనయినా ఊహించుకోలేదు. అనుకుంటే ఇంకా చిక్కటి గంజీ, ఇంకా చిక్కటి సంకటి ఇంకా పెద్దవి చేపలు, కోడిమాంసపు కూరలు ఉంటాయి. అంతకన్నా ఏమిటో అవి ఎప్పుడైనా అనుకున్నదేమో! కాని కావలి పట్టణపు బజారులలో మిఠాయి అంగడులమీద అమ్మే ఆ నోరూరిస్తూ ఘుమఘుమలాడే అవేవో పకోడీలు, కారంపూసా, అవి తన అయ్య పాలిపని చేసే రెడ్డిగారింట్లో తింటారు కాబోలు అని అనుకునేది.

అడివి బాపిరాజు రచనలు - 7

100

జాజిమల్లి(సాంఘిక నవల)