పుట:Chandrika-Parinayamu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. మఱియున్ వచ్చిరి దేశనాయకులు భామామంగళస్ఫూర్తి న
త్తఱి వీక్షింప సురేంద్రనీలరథసంతానంబుపై నెక్కి శ్రీ
మెఱయ న్వారిధరాళిపైఁ దగుధరామిత్రుల్ బలె న్వేడుకల్
దొఱయ న్సంగరపారదృశ్వబలసందోహంబుతోఁ జయ్యనన్. 12

చ. మొనసినయెక్కు చక్కఁదనమున్ నెఱనీటును మించ మోదపూ
ర్తి నపుడు వచ్చురాజసుతబృందము గన్గొన నయ్యె మారు నొ
క్కనిఁ గని యుబ్బు లచ్చిపయి గాటపుటీసు భజించి ధాత్రి నూ
తనవనజాస్త్రకోటుల నుదారమహాత్మతచే సృజించె నాన్. 13

మ. జగతీమార్గము లెల్ల నిండి యిసుము ల్చల్లన్ ధరం జేర న
ట్టుగ నేతెంచిరి రాజపుత్త్రకులు నీటు ల్మీర నప్పట్టునన్
జగదంధంకరణాఢ్యసైన్యవిధుతక్ష్మాధూళిమేఘాళికిన్
మిగులన్ గర్జలఁ గూర్ప మర్దళజధింధిమ్యార్భటీపేటికల్. 14

చ. వనితస్వయంవరోత్సవము వాసిగఁ గన్గొన వచ్చు భూమికాం
తనికర మప్డు దోఁచెఁ గరినాయకపాళులపై నిజైకతై
క్ష్ణ్యనియతి మాని చల్లఁదనమంది మహోదయశైలకోటులన్
దినముఖవేళఁ జూడఁ బడుదీధితిరాజసమూహవైఖరిన్. 15

మ. నెఱి నంకాంచితమూర్తు లందఱు కలానీకైకరోచిష్ణు లం
దఱు సత్పాలనదక్షు లందఱు దగన్ శ్యామాభిరామాత్ము లం
దఱు గానం బఱతెంచురాసుతులు నేత్రప్రీతి చేకూర్చి ర
త్తఱి నౌనా నన విశ్వరూపగతిచేతం దోఁచుచంద్రస్థితిన్. 16

చ. వనజశరు న్హసించుపరువంపువిలాసములేనివాఁడు నూ
తనవరరత్నభూషణవితానము దాల్పనివాఁ డుదారపా
వనబలయుక్తి రాజిలనివాఁ డొకఁడైన నయారె దోఁపఁ డ
య్యె నపుడు పన్నిదంబున కిలేశసుతావళిలోనఁ గన్గొనన్. 17