జన్మించినా తానుమాత్రం పాపపు బురదలో అడుగుపెట్టలేదు. అంచేత ఆమె ముండ్లపొదలో పూచిన లిల్లీపూవు లాంటిది. ముండ్లమొక్కపై వికసించిన గులాబివంటిది. ఆ పరిపూత హృదయ పాపాత్మురాలై పతనమై పోయిన మొదటి యేవకు పరిహారంచేసిన రెండవయేవ. కనుకనే శ్రీసభకూడ యూదితు వాక్యాలను మరియకు అన్వయించి "యెరూషలేమను సంతోషపరచే కన్యవు నీవు. ఈ జనులను ఆనందపరచే ధన్యవు నీవు" అంటుంది - యూది 15,9. ఆనాడు యూదితు హోలోఫెర్నెసు అనే శత్రుసైన్యాధిపతి నుండి యెరూషలేమును రక్షించింది. అలాగే మరియకూడ పిశాచం అనే శత్రువునుండి క్రైస్తవసమాజాన్ని రక్షిస్తుంది. యూదితు విజయం యెరూషలేమునులాగే కన్యమరియ విజయం క్రైస్తవ లోకాన్ని ఆనందపరుస్తుంది.
4. నిష్కళంకమాత బోధించే సత్యాలు
మరియమాత ఎందుకు, ఎలా నిష్కళంకమాత ఐందో చూచాం. ఆమె పావనరూపాన్ని కొంతవరకు ధ్యానించుకున్నాం. ఆ పుణ్యశీల పతిత నరజాతికి చెందిన మనకు కొన్ని సత్యాలను బోధిస్తుంది.
పవిత్రురాలైన మరియు నేడు పవిత్రుడైన భగవంతుని సన్నిధిలోవుంది. మన యిల్లుకూడ అక్కడేగాని యిక్కడకాదు. అంచేత మరియు మనం దృష్టిని ఆవైపునకు మరల్చాలని ప్రబోధిస్తుంది. మనం ఆ దేవునికోసం కలిగించబడ్డామని హెచ్చరిస్తుంటుంది. అటువైపు పయనించమని మనకు సంజ్ఞ చేస్తుంటుంది.
ఆ తల్లికి పాపమాలిన్యం సోకలేదు. పవిత్రుడైన భగవంతుని తల్లి ఎంత పవిత్రరాలుగా వుండాలో అంత పావిత్ర్యంతో అలరారింది. దేవుడు మనలనుకూడ పవిత్ర జీవితం జీవించడానికే కలిగించాడు. అంచేత మరియు మనలను నిర్దోషంగా నిష్కల్మషంగా జీవించమని ఆదేశిస్తుంది. దేవుని సన్నిధిలో నడుస్తూ ఉత్తమ జీవితం జీవించాలని సూచిస్తుంది.
మరియ పాపాన్ని జయించి మోక్షాన్ని సాధించింది స్వీయశక్తివల్లగాదు, దైవశక్తివల్ల. కనుక ఆమె మనం కూడ దైవబలంతో దివ్యజీవితం జీవించి మోక్షంలో అడుగుపెట్టాలని చెప్తుంది. ప్రభువమీద భారంవేసి జీవించాలని బోధిస్తుంది.
5. నిష్కళంకమాతపట్ల భక్తిభావాలు
నివ్కాళంక మరియను మనం చక్కగా ధ్యానించుకోవాలి. భగవంతుడు నరుణ్ణి తనకు పోలికగా చేసాడు. ఆ దేవుళ్లాగే నరుడుకూడ దివ్యడు. కాని తొలి మానవుడైన