ఆ ప్రభువు తన భక్తులకు పశ్చాత్తాపమనే వరాన్ని ప్రసాదిస్తూంటాడు. ఈ వరంతో భక్తులు రోజురోజుకి హృదయశుద్ధిని పొందుతుండాలి.
1. దావీదు ఊరియాభార్య బత్తైబాను ఆశించాడు. ఊరియాను చంపించి ఆమెను తన భార్యను చేసికొన్నాడు. అప్పడు ప్రభువు పంపగావచ్చి నాతానుప్రవక్త రాజును మందలించడానికై ఓ కథ చెప్పాడు. ఓ వూరిలో ఓ పేదవాడూ ఓ ధనవంతుడూ ఉన్నారు. ధనవంతునికి గొర్రెల మందలు చాలా ఉన్నాయి. పేదవానికి ఒక్క గొర్రెపిల్ల మాత్రమే ఉంది. ఓ దినం ధనవంతుని యింటికి చుట్టంరాగా అతడు తన గొర్రెల నంటుకోకుండా దౌర్జన్యంతో పేదవాని గొర్రెపిల్లను కోయించి బందుగునికి భోజనం తయారు చేయించాడు - అని చెప్పాడు. ఆ మాటలకు దావీదు మండిపడి ఆలాంటి పాడుపని చేసినవాణ్ణి దండించాలి అన్నాడు. అతడు నాల్గవంతులు నష్టపరిహారం గూడ చెల్లించాలి అన్నాడు. అప్పడు ప్రవక్త రాజుతో - ఆపాడు పని చేసినవాడవు నీవే. నీకు ఇంతమంది భార్యలుండగా వూరియా భార్యను గూడ అపహరించావు. నీవు చేసిన ఈ చెడుపని ప్రభువుకి నచ్చలేదు - అని అన్నాడు. దావీదు అంతరాత్మ ఆతన్ని మందలించింది. అతడు పశ్చాత్తాపపడి ప్రభువుని మన్నింపు అడుగుకొన్నాడు -2 సమూ 12, 1-13,
2. స్నాపక యోహాను క్రీస్తుకు ముందుగా వచ్చాడు. క్రీస్తుకు త్రోవ సిద్ధం చేయడం అతనిపని. అతడు 'దైవరాజ్యం సమీపంలో ఉందిగనుక పశ్చాత్తాపపడండి" అని బోధించాడు. ఇక్కడ దైవరాజ్యమంటే క్రీస్తే, యూద ప్రజలు తరతరాలనుండి ఎదురుచూస్తూవచ్చిన మెస్సీయా రానే వచ్చాడు. కనుక ప్రజలు తమ పాపాలకు పశ్చాత్తాపపడి హృదయం మార్చుకొని అతని బోధలు ఆలించాలి అని భావం, తర్వాత క్రీస్తువచ్చాక అతడు కూడ పై యోహాను వాక్యంతోనే తన బోధ ప్రారంభించాడు - మత్త 3, 2;4, 17.
3. ఓ కాపు తనతోటలో అంజూరపు చెట్టును పెంచాడు. కాని మూడేండ్ల గడిచినా దానికి కాపు పట్టలేదు. అతడు దానిపై కోపించి తోటమాలితో ఆ చెట్టును నరికివేయమని చెప్పాడు. కాని తోటమాలి అతనితో ఇంకొక్కయేడు చూద్దాం. దానిచుటూ త్రవ్వి యెరువవేద్దాం. అప్పటికీ కాపు దిగకపోతే కొట్టిపారేద్దాం అన్నాడు. ఏమిటి ఈ యుపమాన భావం? సకాలంలో పరివర్తనమనే ఫలితమీయని నరుడే యీ చెట్టు. న్యాయాధిపతియైన దేవుడు పశ్చాత్తాపపడని పాపాత్ముణ్ణిజూచి కోపగించు కొంటాడు - లూకా 13, 6-9.
4. పేత్రు ప్రభువుని ఎరుగనని ముమ్మారు బొంకాడు. అటుతరువాత అతడు మంటదగ్గిర కూర్చుండి చలిగాచుకొంటున్నాడు. అప్పడు యేసుని బంధించి తీసికొని