జ్ఞానస్నానం అభిలషించే భక్తిమంతమైన జీవితం జీవింపగోరేవాళ్ళంతా, చావైన పాపం లేకపోయినా గూడ, తరచుగా పాపోచ్చారణ చేయడం మంచిది. మన హృదయం పవిత్రం కావాలంటే ఈ సంస్కారం అత్యవసరం. ఈ సంస్కారం ద్వారా మన పాపాలు పరిహారం కావడం మాత్రమే కాదు ఆత్మశోధనం పశ్చాత్తాపం మొదలైన మన పరివర్తన క్రియలు కూడ పునీతమౌతాయి.
పాపోచ్చారణానికీ దివ్యసత్ప్రసాద స్వీకరణానికీ దగ్గరి సంబంధం వుంది. మంచి పాపోచ్చారణం ద్వారా మనం దివ్య సత్ర్పసాదాన్ని యోగ్యంగా స్వీకరిస్తాం, "ప్రతివాడూ తన్ను తాను పరిశీలించుకొని ఈ రొట్టెను తిని ఈ పానీయాన్ని సేవించాలి" అన్నాడు పౌలు - 2కొరి 11,28. అందుకే శ్రీసభ చావైన పాపంలో వున్నవాళ్ళ పాపోచ్చారణం చేయందే దివ్యసత్రసాదాన్ని పుచ్చుకోగూడదని నియమం చేసింది. కాని చావైన పాపం లేనపుడు సత్రసాద స్వీకరణానికిముందు తప్పకుండా పాపోచ్చారణం చేయవలసిన అవసరం లేదు.
1980లో శ్రీసభ చేసిన శాసనం ప్రకారం, మఠజీవితం జీవించేవాళ్ళంతా 15 రోజుల కొకసారి ఈ సంస్కారంలో పాల్గొనాలి. ఈ నియమాన్ని ఖండితంగా పాటించనక్కరలేదు. ఐనా మఠజీవిత0 జీవించేవాళ్ళ పవిత్రులుగా వుండాలి కనుక తరచుగా దీనిలో పాల్గొని ఇతరులకు కూడ మంచి ఆదర్శం చూపించాలి. ఇక విశ్వాసులు కూడ దీనిలో తరచుగా పాల్గొంటే విశేష లాభాలు కలుగుతాయి. గృహస్థులు మామూలుగా రెండు వారాల కొకసారైనా పాపోచ్చారణం చేయాలి అని నియమం పెట్టుకోవడం మంచిది.
తపస్సు కాలానికీ పాపోచ్చారణానికీ గూడ దగ్గరి సంబంధం వుంది. తపస్సుకాలంలోని విబూది బుధవారం నుండి శ్రీసభ తన బిడ్డలు పశ్చాత్తాపపడాలని పూజపఠనాల్లో మాటిమాటికీ హెచ్చరిస్తూంటుంది. కనుక ఈ కాలంలో విశ్వాసులు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి తమ పాపాలకు మన్నింపు పొందడం ముదావహం.
ప్రస్తుతం విశ్వాసులు పాపోచ్చారణ సంస్కారాన్ని చాల అశ్రద్దచేస్తున్నారు. చాలమంది పాపోచ్చారణం చేయడమే లేదు. ఇది విచారింపదగిన విషయం. మనమట్టుకు మనం విశ్వాసులు భక్తిమంతమైన మంచి పాపోచ్చారణం చేసేలా చూడాలి. ఒకమారు ప్రజలు భక్తితో పాపోచ్చారణం చేయడానికి అలవాటుపడితే, తరచుగా పాపోచ్చారణం చేయడమనేది దానంతట అదే వస్తుంది.
నేడు చాలమంది పాపోచ్చారణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పాం. లక్ష్యంచేసే వాళ్ళల్లోగూడ చాలమంది దేవుని పట్లగల భక్తి ప్రేమలవల్ల గాక భయంవల్ల దీనిలో పాల్గొంటున్నారు. వీళ్లు ఈ సంస్కారాన్నియాంత్రికంగా పాపాలను పరిహరించే తంతుగా