పుట:Andhraveerulupar025958mbp.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందెను. కవులను గాయకులను బోషించి చిత్రకళల నభిమానించెను. నాడుమొదలు నేటివఱకు గద్వాల సంస్థానము విద్యాభిమానమును దాతృతా రూపమున బ్రకటించుచునే యున్నది. సోమనాద్రి భూపాలుడు క్రీ.శ. 1700 మొదలు 1770 లోగ నుండి యుండును. ఈ సోమనాద్రి భూపాలునకు ఇరువురు ధర్మపత్నులు గలరు. ఇద్దఱు కుమారులు జనించిరి. వారు బాలురగుటచే సోమనాద్రి యనంతరము లింగాంబయను ప్రథమభార్యారత్నము కొంతకాలము రాజ్యము నేలి యుక్తవయస్సు రాగానే తన భారమునంతయు బెద్దకుమారునిపై బెట్టెను. జ్యేష్ఠపుత్రుడు తిరుమలరాయడు పితృసంపాదిత మగు రాజ్యమును జిరకాలము పాలించెను. సోమనాద్రి భూపాలుడు గతించి చిరకాలమైనను ఆయన కీర్తిమాత్ర మింతవఱకు మరుగుపడలేదు. ఆయన యంకితము నొందిన భారత విరాట పర్వాది గ్రంథరాజము లాతని కీర్తిని గొనియాడుచున్నవి. అత్యున్నతములగు దుర్గములు, గోట గోడలు గల నాటి గద్వాలనగర విభవము చెక్కుచెదరక నేటికిని పూర్వప్రశస్తిని జాటుచునే యున్నది. పౌరుషవంతములగు పూర్వరాజ్యములలో నేటివఱకు మిగిలి యున్నవి వ్రేళ్లతో లెక్కింపదగియున్నవి. ప్రాచీనవిద్యపట్ల గౌరవము జూపుచు బండితసన్మానములు గావించుచు బూర్వమర్యాదలు నిలువబెట్టుచున్న యీ సంస్థానరాజమునెడ నాంధ్రులకు,