పుట:AndhraRachaitaluVol1.djvu/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాడు కొన్నినా ళ్లీగీతము చదువనివారు లేరు. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు తెల్లవారను= తెల్లవారగా, అను నర్థము చెప్పి ప్రభుత్వము నోదార్చిరి. అప్పుడే వీరిపేరు మాఱుమ్రోగినది. బహుజనముచే నాదరింపబడు కవితయే కవిత. అదియే శాశ్వతముగా నిలుచును. మన చిలకమర్తి లక్ష్మీనరసింహముగారి పద్య మొక్కటైన కంఠపాఠము చేసికొననివారు తెలుగువారిలో నుండరు.


తుహినాద్రి మొదలు సేతువుదాక రాజ్యంబు జరిపె నీ యాంగ్లేయ దొరతనంబె, జాతిమతాచార సర్వస్వతంత్రముల్ నెఱపె నీ యాంగ్లేయ దొరతనంబె, ఇత్యాది స్తుతులతో 1895 లో చిలకమర్తి కవి పద్యములు రచించెను. ఆ చిలకమర్తికవి మఱల గొన్నేండ్లు గడచిన తరువాత నాంగ్లేయప్రచురణసంస్థవారొకరు వాచకములు వ్రాసి పెట్టుడని వేడగా "ఆంగ్లేయులు మన దేశములోనిగనులవలనను, టీ కాఫీలవల్లను, రైలుబండ్లవల్లను, మరి యితరసాధనముల వల్లను ధనమంతయు పట్టుకొని పోవుచున్నారు. తెనుగుదేశములో పుట్టి తెనుగుముక్కలు నాలుగు వ్రాయనేర్చిన మనము తెనుగుపుస్తకములవల్ల వచ్చు లాభము అనుభవించకుండ నదికూడ నాంగ్లేయులకే యీవలెనా ? నేనెన్నడు నింగ్లీషు కంపెనీలకు గ్రంథములు వ్రాసి యీయను. స్వదేశీయు లెవ రేని చేరి యొక కంపెనీ పెట్టినపక్షమున వారికి వ్రాసియిచ్చెదను. లేదా, నాకు నేనే వ్రాసికొనెదను." అని చెప్పివైచెను. ఈవిధమైన దేశాభిమానమభినందనీయము.


నవలారచనమునను, నాటకకర్తృత్వమునను, ప్రహసనపు గూర్పునను సిద్ధహస్తుడై, దీనావనదీక్షితుడై, దీర్ఘాయుష్కుడైన లక్ష్మీనరసింహకవి కాంధ్ర విశ్వవిద్యాలయమువారు మొన్న 1943 లో కళాప్రపూర్ణ బిరుదము నొసగి సముచితముగ సత్కరించిరి. ఇట్టి యీమహాకవి వీరేశలింగకవి తరువాత 'స్వీయచరిత్ర' వ్రాసికొనెను. వీరి స్వీయచరిత్ర, ఆంధ్రకవుల చరిత్రయు-ఆంధ్రదేశచరిత్రము నన గలిగి మహోపకారకమయిన గ్రంథము.


                            ________