పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అలాగునా! వారి ఓడ సురక్షితంగా ఉంటుందని ఎందుకో నాకు తోస్తున్నది నాన్నగారూ!” అని శాంతిశ్రీ కళ్ళనీరు నింపింది.

“ఏమిటి తల్లీ! ఈ కంటినీరు?” అని శాంతిమూలమహారాజు ఆమెను తన హృదయానికి అదుముకొన్నారు.

శాంతిశ్రీ తండ్రి హృదయాన తలవాల్చుకొని తండ్రి మెడచుట్టూ చేతులు చుట్టి శరీరమంతా కదిలేటట్టు వెక్కివెక్కి ఏడ్చింది. ఆయన మనస్సులో కొమరిత చెప్పినట్లు బ్రహ్మదత్తప్రభువు బ్రతికే ఉన్నాడని తోచింది. తన్ను ఓగియార కౌగిలించికొనియున్న కుమారై హృదయాన నిండిన బ్రహ్మదత్తుడు తన హృదయాన చొచ్చి, తొంటికంటె తన కాత్మీయుడైనట్లు తోచి మహారాజు కన్నులు మూసుకొన్నారు. మహారాజు కొమరితను నెమ్మదిగా నడిపించుకొనిపోయి, ఆమె నచ్చటనున్న మంచపీఠముపై పరుండబెట్టి అక్కడే ఒక పీఠముమీద కూర్చుండినాడు. శాంతిశ్రీ చటుక్కున లేచి కూర్చుండెను.

"బ్రహ్మదత్తప్రభువు విద్య అనన్యము నాయనగారూ! ఆయనంత జ్ఞాని ఎవ్వరూ ఉండరు. నాకు బోధించిన గురువులలో ఉత్తములు.”

శాంతిశ్రీ 'నాయనగారూ' అని మహారాజు శాంతిమూలుని ఎన్ని ఏళ్ళనుంచో అలవాటయిన కొమరితలా సంబోధిస్తున్నది. ఆ మాట పాటలా, దివ్య రాగంలా, పరమ మంత్రంలా శాంతిమూలుని చెవినిబడుతున్నది.

“కుమారీ! బ్రహ్మదత్త ప్రభువు నీకు విద్యబోధించింది కొద్దిదినాలే కాదా?”

“కొద్దిదినాలయినా, పండు ఒలిచినట్లే ఆయన బోధించడం. మొదట నాకు ఈ గురువెందుకన్న భావం కలిగింది, కాని మొదటిపాఠం అవుతూనే ఆయన మాహాత్మ్యం అవగాహన అయిపోయింది.”

శాంతిమూలునకు బ్రహ్మదత్తుడు పాఠాలు ప్రారంభించిన మొదటి దినాలు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఆ దినాలలో శాంతిశ్రీ తనకీ గురువెందుకని అన్నది. నేడు ఆ మాటలే లేవు! మహారాజు లేచి, కొమరిత నమస్కార మంది, ఆమెను ఆశీర్వదించి తన అంతఃపురానికి వెడలిపోయినాడు.

శాంతిశ్రీ కదలకుండా అలాగే కూర్చుని ఉంది. ఆమె చూపులు ఎదుటి వస్తువులమీద లేవు. ఆమె ఏదియో ఆలోచనాపథాలలో విహరిస్తున్నది. అప్రయత్నంగా ఆమె కంఠంలోనుండి ఒక పాట ఉదయించింది.

     “ఏమిది ఈ జననము మరణము
     ఎవ్వరు ఈ పురుషులు స్త్రీలూ
     ఎవ్వరు తండ్రి తల్లీ బిడ్డలు
     ఎందుకు ఈ జగమేలా ఎవరికి
                   ఏమిది?...
     గురు వేమిటికీ శిష్యుడేమిటీ
     గురువులు నేర్పే చదువెందులకూ?
                   ఏమిది?........

అడివి బాపిరాజు రచనలు - 6

108

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)