“మనం ఎరిగి ఉన్నంతవరకు మన ఓడలు ఎప్పుడూ నాశనంకాలేదు.”
“చిత్తం.”
“మన ఇక్ష్వాకు రాకుమారులు ధైర్యంగా ఓడ ప్రయాణాలు చేయగలరు.”
“అవును దేవా! మా మాఠరీకుమారులు కళింగపట్టణాన్నుండి ఎప్పుడూ ఓడ ప్రయాణాలు చేస్తూనే ఉంటారు.”
“అయితే, నేడు బ్రహ్మదత్తప్రభువు ఓడ ప్రయాణానికి వెళ్ళారు!"
“ఓడ ప్రయాణమా?”
“అవును. నేను పూంగీయప్రభువును, మీ ఆడబిడ్డను, రాకుమారీ, కుమారులను ఆహ్వానింప బ్రహ్మదత్తప్రభువును పంపాను.”
“అయితే ఓడ ప్రయాణమేమిటి?”
“ఆయన కుడిచి కూర్చుండలేక నౌకావిహారానికి వెళ్ళినారు.”
“అయితే మహాప్రభూ....”
“ఆ వెళ్ళడం మొన్న మన దేశంలో ముసురుపట్టలేదు. ఆ దినాన!”
“తిరిగి సురక్షితంగా వచ్చారా?”
“వస్తే నాకు ఈ ఆవేదన ఎందుకు దేవీ!”
“ఏమిటి విషయం విపులంగా చెప్పండి మహాప్రభూ!”
10
శాంతిశ్రీ రాకుమారికి బ్రహ్మదత్తప్రభువు కథనం వినిపిస్తూ మహారాజు ఆ బాలిక మోము జాగ్రత్తగా పరిశీలించ సాగినారు.
“ఏమిటి మహాప్రభూ! బ్రహ్మదత్తప్రభువు సముద్రంలో ఏమై పోయారో తెలియదంటారా?”
“అవును తల్లీ! వారిగతి ఏమైందో? ఆయన బ్రతికి ఉన్నాడో లేదో?”
“ఆ నౌక సురక్షితంగా ఉండకూడదా మహాప్రభూ!"
“ఉంటే ఈపాటికి ఏ తీరమో చేరి ఉండదా?”
“అవతలితీరం చేరకూడదా?”
“చేరవచ్చును. కాని అంతటి అదృష్టవంతుడనా?”
“నాకు మంచి గురువు లభించారని సంతోషించాను నాన్నగారూ!” అంటూ రాకుమారి డగ్గుత్తిక తాల్చింది.
శాంతిశ్రీ 'నాన్నగారూ' అని తన్ను సంబోధించగానే శాంతి మూలుడు వెంటనే ఆశ్చర్యమూ, సంతోషమూ, విషాదమూ పొందినాడు, తన్ను ఇంతకుమున్ను తండ్రిగానే చూడని బాలిక, నేడు 'నాన్నగారూ' అని పలుకరించినది అన్న సంతోషముతోపాటు ఆ మార్పుతెచ్చుటకు కారణమైన బ్రహ్మదత్తప్రభువు ఏమైనాడో అని విషాదం కలిగింది.
“శాంతీ! మామయ్యగారు పూంగీయ స్కందశ్రీ ప్రభువులు వారిని వెదకడానికి తమ యుద్ధనౌకలను పంపారట.”
అడివి బాపిరాజు రచనలు - 6
107
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)