పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మావతి.

221

జయదేవునకు సంసార మసారమనితోచక మిగుల సారముగాఁ గానుపించుచుండెను. జయదేవుఁడు పీయూషవర్షుఁడగు కవియని ప్రసిద్ధిఁ గాంచెను. ఆయన సాహిత్యసంగీత విద్యలయం దసమానపాండిత్యము గలవాఁడై ప్రసన్న రాఘవ మనునాటకమును గీతగోవిందమను సంగీతగ్రంధము రచియించెను.

ఇట్లాదంపతులు సుఖముగా నుండఁ గొన్నిదినంబుల కొకయూరి సాహుకారు జయదేవుని మిగుల వేఁడుకొని సమీపమునం దున్న తనగ్రామమునకుఁ గొనిపోయెను. జయదేవుఁ డచటఁ గొన్నిదినంబు లుండి యాగ్రామమునం దంతటను ననేకులను భక్తులనుగాఁ జేసెను. తదనంతర మాయన స్వగ్రామమునకుఁ బ్రయాణ మగుటఁ గని యాసాహుకా రాయనకుఁ దెలుపక గుప్తముగా నాబండియడుగున కొంతద్రవ్యము నునిచి యింటి కేఁగినవెనుక పద్మావతిగారి కిమ్మని తనబంటగు బండితోలువానితోఁ జెప్పెను.

ఇట్లు బయలుదేరి జయదేవులు కొంతదూర మరిగినపిదప నతనిబండిలో ధనమున్న సంగతి యరణ్యవాసులగు దొంగలకుఁ దెలిసి వా రాబండిని నాపి సకలధనమును దోఁచుకొని జయదేవుని వదలినఁ దమకు నతఁడు రాజభటులచే నపాయముఁ జేయించునని తలఁచి, కాలు సేతులు కట్టి జయదేలను నొకపాడు నూతిలోఁ బాఱవేసిరి. అందుపైఁ గొంతసేపటికి క్రౌంచ దేశాధీశ్వరుఁ డచటికి వేఁటాడ వచ్చి జయదేవునిఁ గని తన నగరమునకుఁ గొనిపోయెను. అచట రాజవైద్యులచే ననేకౌషధోపాయములు చేయించఁగా జయదేవుల కాలు సేతుల గాయములు మానెను. జయదేవుల యపారపాండిత్య