హిందువుల ననేకులను తురుష్క రాజులు పశువులవలె నరికి వేసిరని యితిహాస ప్రసిద్ధమే కనుక, బేగముగారియందు గల సమత విశేష ప్రశంసనీయము.
బేగము షహజహానునకు, అనగా బేగముగారి కొమార్తెకు బదునెనిమిది సంవత్సరముల ప్రాయము వచ్చువరకు బేగముగారు రాజ్యము చేయవలయునని యింగ్లీషువారు సిద్ధాంతము జేసిరని వెనుక వ్రాసియుంటిని. ఇంత కొద్దికాలములోనే బేగమువారు తన సంస్థానమును ఒక యద్వితీయమైనట్టియు, ననుకరణీయ మైనట్టియు సంస్థానముగా జేసిరి. అక్బరుబాదుషా తరువాత జన్మించి రాజ్యపరిపాలనను జేసిన తురుష్కులలో నీమె యుత్తమ ప్రభ్వియని చెప్పుటకు సందేహములేదు. అక్బరునందుండిన సద్గుణములలోని యనేక సద్గుణము లీమెయందు వాసము చేయుచుండెను. కంపెనీవారి ప్రభుత్వములోని గొప్పగొప్ప యధికారు లీమె రాజ్యవ్యవస్థను జూచి సానందాశ్చర్యమును బొందుచుండిరి. రాజ్యములోని ప్రజలందరును సదా సంతోషముతో "మా పురాకృత పుణ్యమువలన మా కీ శికందరు బేగముగారు రాణిగా లభించిరి" అని కొనియాడుచుండిరి.
ఇట్లు బేగమగారు సకలవందితులయి రాజ్యము జేయుచుండ, ఆమెకూతురగు బేగముషహజహాను ఉపవరయయ్యెను. అప్పుడు బేగముగారీ చిన్నదానికి, బక్షిబాకర మహమ్మదఖానను వరుని దెచ్చి, వివాహము జేసిరి. అప్పటికి బేగముగారు బిడ్డకు రాజ్యమిచ్చుటకు మూడుసంవత్సరముల