నచ్చటికిపోయెను. అచ్చట నామె చంపినవారి నందరినిజూచి, స్వయముగా నిచ్చెనపైకి నెక్కి, గవాక్షమువద్ద నిలువబడి, యిట్లనియె. "ఓ యసమాన శౌర్యముగల స్త్రీ! నీ వెవ్వరవు? ఇట్లు నా ప్రజలను జంపుటకు గారణమేమి? నేనీ పట్టణమునకు రాజును. నీ కెవరైన నపరాధము చేసిన పక్షమున జెప్పుము. వారిని నేను దండించెదను." అందుపయి "మహారాజా! నేను చావడా కులోత్పన్నుడయిన బిరజ మహారాజు గారి చెల్లెలను; ధారానగరమునకు నధిపతియైన యుదయాదిత్య మహారాజుగారి కోడలను. నా పేరు వీరమతి" అని చెప్పి తన వృత్తాంతమంతయు, తన్ను మోసపుచ్చిన వేశ్యాంగన యిచ్చటికి దీసికొని వచ్చిన విధమును సవిస్తరముగాజెప్పి, లాలుదాసుని యనుచిత కృత్యమును దెల్పి, "నా పాతివ్రత్య రక్షణమునకయి నేను వానిని జంపితిని; నన్ను బట్టుకొనవచ్చిన పదునొకండురనుగూడ అందునకే వధించితిని; నేను క్షత్రియకన్యను. నా దేహము నందు బ్రాణ ముండువరకు నన్యపురుషస్పర్శ కానియ్యను" అని స్ఫుటముగా వీరమతిపలికెను. ఆ మాటలువిని రాజెంతయు సంతసించి "రాజపుత్ర స్త్రీలకు దగినపని చేసితివి, వెడలి రమ్ము; నిన్ను నేను నా పుత్రికవలె బాలించెదను. నీ పెనిమిటిని వెదకించెదను" అని పలికెను. కాని "నా పెనిమిటి వచ్చినగాని యీ మేడతలుపు తియ్యనని ప్రతిజ్ఞ చేసియున్నాను. కనుక మొదట నా పెనిమిటిని దెప్పించిన పక్షమున తమయాజ్ఞ శిరసావహించెదను. లేనిపక్షమున నిచ్చటనే దేహమును విడిచెదను" అని వీరమతి యుత్తర మిచ్చెను.