పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవభక్తియు, నప్రతిమ సాధువృత్తిగని క్రౌంచరా జాతనిని గురువుగా భావించి సేవింపుచుండెను.

ఇచట పద్మావతి భర్తకొరకు ననేకస్థలముల వెదకించియు వెదకియు జాడగానక మిగుల దు:ఖముతో బుట్టినింటనే యుండి భర్తజాడ లరయుచుండెను. ఇట్లు కొన్నిదినములు గడిచినవెనుక క్రౌంచాధీశ్వరుడు జయదేవుల వార్త దెలిపి పద్మావతిని దోడుకొని వచ్చుటకయి తనపరివారమును బంపెను. వారు చెప్పినవార్త విని పద్మావతి మిగుల సంతోషముతో భర్తకడకేగెను.

పద్మావతి గురుభార్య యగుటవలనను మిగుల పతివ్రతయని ప్రసిద్ధిగాంచుటవలనను రాజపత్ని మిగులశ్రద్ధతో నామె వలన ననేకనీతులు వినుచుండెను. ఇట్లొకనాడు పద్మావతి పాతివ్రత్యమునుగూర్చి యుపన్యసింపుచుండగా నచటికి నొక సేవకుడు వచ్చి రాజపత్ని సమీపబంధువుడెవడో యొకడు లోకాంతరగతు డాయెననియు, ఆయన వియోగము సహింప లేక యాతని భార్య సహగమనము చేయబోవు చున్నదనియు దెలిపెను. ఆసంగతి విని యచటి స్త్రీలందరు మిగుల నాశ్చర్యపడజొచ్చిరి. కాని పద్మావతికి నాసంగతియొక విశేషముగా దోచకపోవుటవలన నామెముఖమునం దాశ్చర్యభావ మించుకయు గానుపించదయ్యె. అందుకు రాజపత్ని పద్మావతిని "అమ్మా! ఆ మహాపతివ్రత సకల సుఖములను విడిచి భర్తతో సహగమనము చేయునన్నవార్తవిని మీ కాశ్చర్యము కలుగ లేదా? దయచేసి మీమనోగతము నెరిగింపు"డని వేడుకొనెను.