విజయము నిమ్మని ప్ర్రార్థన జేయుచుండెను. ఆమె యుపదేశము విని యా నగరమునందలి యువతులంద రామె వలెనే డీల్లీశ్వరునకు విజయము కలుగవలయునని పర మేశ్వరు ననేకవిధముల వేడుకొనుచుండిరి.
తుద కొకదినమున నా సైన్యములు రెండును నొండొంటి దాక నా యుభయ సైన్యములలోని వీరులును దమతమ సంగ్రామ కౌశలములు మీర ఘోరంబుగా బోరదొడంగిరి. వారట్లు పోరుటచే నాకాశమంతయు ధూళి గ్రమ్మి, సూర్యుని మరుగుపరచెను. అంత గొంతవడికి నాధూళియడగి రక్తనదులు బారజొచ్చెను. పీనుగులపెంట లనేకములు పడెను. ఇట్టి రణరంగమునందు పృథివీరాజునకు నపజయము కలిగెను. కాని యాతని సైనికులలో శత్రువునకు శరణుజొచ్చినవాడేని, యుద్ధ భూమినుండి పారిపోయినవాడేని కానరాకుండెను. పృథివీరాజు గూడ నా యుద్ధమునందే మడిసెనని కొందరు చెప్పెదరు. గోరీ విజయుడయి పృథివీరాజును చెరబట్టి గ్రుడ్లు తీసివేసి యాతని పాదములకు మిక్కిలి బరువులయిన లోహపు బేడీలను వేసి కారాగృహమునం దుంచెననియు, నీసంగతి యంతయు విని పృథివీరాజు మంత్రియు, నతని చరిత్రలేఖకుడును, మహాకవియునగు చాందభట్టు గోరీయాస్థానమున కరిగి కొన్నిదినము లచట నుండి యాతని కృపకు బాత్రుడై పృథివీరాజును చూచుట కనుజ్ఞవడసెననియు, అట్లు సెలవంది కారాగృహమున కరిగి పృథివీరాజును పలుకరింపగా నాతడు కన్నులు లేకున్నను మాటనుగుర్తించి యా భట్టును కౌగిలించుకొనెననియు, అచట