మూడువేల సైన్యము నంపెను. కహరకంఠీరుడను వాని ముందిడుకొని శత్రుసైన్యములు తమవైపునకు వచ్చుట గని పృథివీరాజును వారితోబోరుటకు సిద్ధముగా నుండెను. తదనంతర మారెండుసైన్యంబు లొండొంటిందాకి మిగుల ఘోరంబుగా బోరసాగెను. అందు పృథివీరాజు సేనానియగు ఆతతాయికిని, జయచంద్రుని సైన్యాధిపతియగు కహరకంఠీరునకును ద్వందయుద్ధంబు ప్రాప్తించెను. ఆ శూరు లిరువురును సింహనాదములు చేయుచు నొండొరులతో నెక్కుడు పంతంబులు పలుకుచు, నొకరినొకరు నొప్పించుచుండిరి. అంత గొంత సేపటికి భటులయొక్కయు, గుర్రములయొక్కయు, నేనుగుల యొక్కయు, దేహములనిండ కారు రక్తము ప్రవాహమయి పారదొడగెను. అట్టి సమయమున కహరకంఠీరుని రోషవేశ మధికమయినందున నాతడు తన రధంబు డిగ్గి ఆతతాయిని తన ఖడ్గమునకు బలియిచ్చి పృథివీరాజు కంఠము తెగవేయ నుంకించెను. కహరకంఠీరుని శౌర్యమునకోడి పృథివీరాజు బలంబులు చెదరి పారసాగెను. అట్టి సమయంబునందాకస్మికముగా నొక శౌర్యనిధి యచటికివచ్చి పృథివీరాజు కంఠముపైబడనున్న ఖడ్గమును దునియలుచేసి యాతని గాపాడెను. ఈ పరాక్రమ వంతుడెవడో యొక రాజపుత్రుడని చదువరులు భ్రమపడ వలదు. అట్లు తన సాహసమువలన పృథివీరాజును గాపాడినది. యాతని పత్నియు, జయచంద్రుని కూతురునగు సంయుక్తయే. ఆమె తన భర్తనుగలసి యాతనితో వెళ్ళవలయునని బహు ప్రయాసముతో గారాగృహమువెడలి యతి యోగ్యమైన