పుట:Abaddhala veta revised.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేరాలు చేసిన వారిని మతాతీతంగా ఒకే తీరులో శిక్షిస్తున్నట్లే, పౌరస్మృతి కూడా మతరహితంగా వుండాలి. సెక్యులరిజంలో మతానికి స్థానం లేదు. ప్రభుత్వం మతాన్ని పట్టించుకోరాదు. ఇది చాలా ముఖ్యం. ప్రభుత్వంలో వున్నవారు ఇందు నిమిత్తం చేయాల్సిన పనులు కొన్ని వున్నాయి.

మత ఉత్సవాలకు, పండుగ పబ్బాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించరాదు. పండుగ చేసుకోదలచిన వ్యక్తులు సెలవులు పెట్టుకోవాలి.

మత ఊరేగింపులు,మేళాలు, సమావేశాలు అన్నీ శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం పరిగణించాలి.

అధికారంలో వున్న వారెవరూ తమ అధికారాన్ని వినియోగించి మతపరమైన వాటిలో పాల్గొనరాదు. వాహనాలు వాడరాదు. పర్యటనలు చేయరాదు. రేడియో, టి.వి.లలో ప్రసారాలు మతపరంగా జరపరాదు. అలాంటప్పుడు ప్రజలలో అసూయ ద్వేషం పెచ్చరిల్లదు.

మతపరమైన ఆస్తులకు ఆదాయంపన్ను వుండాలి. బాబాలు, ఆశ్రమాలకు మినహాయింపులు వుండరాదు. అలాగే విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు వుండరాదు. మతపరమైన యాజమాన్య గుర్తింపు వుండరాదు. మతాన్ని పాఠశాలల్లో శాత్స్రీయంగా పాఠాల్లో చెప్పవచ్చుగాని బోధనగా, ప్రచారంగా కాదు.

ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో మతపరమైన ఆరాధనలు, ప్రచారాలు, చందాలు వసూలుచేయుట నిలిపివేయాలి.

మసీదులు, దేవాలయాలలో మైకులు పెట్టి, పిల్లల వదువులకు అవరోధంగా శబ్దకాలుష్యం జరపడం అనుమతించరాదు.

రాజకీయవాదులు ఇన్నాళ్ళుగా మౌల్వీలను,బాబాలను ప్రోత్సహిస్తూ తమ అవసరాలకు వాడుకున్నారు. సాయిబాబా, కంచి ఆచార్య,పూరిశంకరాచార్య, ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి, ఇలాంటి వారంతా ఆ బాపతే. ఆ పనులు మానాలి.

రోడ్డు మీద ట్రాఫిక్ కు అడ్డమొచ్చే తీరులో మత మందిరాలు నిర్మించడాన్ని అనుమతించరాదు.

ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనులు మతపరంగా చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తగదు.

సెక్యులరిజాన్ని శాస్త్రీయంగా అమలుపరచడానికి గాను యూనిఫారం సివిల్ కోడ్ చట్టపరంగా తక్షణం తీసుకురావాలి.

- హేతువాది, జనవరి 1993