దళితులకు ఓట్లు వున్నాయి. అవి రాజకీయ పార్టీలకు కావాలి. అన్ని పార్టీలు అనేక పథకాలు, ఆకర్షణలు వలగా వేసి దళితుల్ని ఆకర్షించడానికి యథాశక్తి పోటీ పడుతున్నాయి.
దళితుల మౌళిక సమస్యల్ని పరిష్కరించాలని ఏ రాజకీయ పార్టీ అనుకోవడంలేదు.
ఏమిటి ఆ మూల సమస్య?
అంటరానితనం, వూరికి దూరంగా, సంఘసేవలో మాత్రమే పనికివచ్చే వారుగా దళితుల్ని భారతదేశం ముద్రవేసింది. ఇది శతాబ్దాల చరిత్ర.
స్వాతంత్ర్య పోరాటంలో అంటరానితనం పోగొట్టే సమస్యను గాంధీ చేబట్టారు. మరో చేత్తో కులవ్యవస్థను సృష్టించి బలపరుస్తున్న గీతను చేతబూని ప్రార్థనలు చేశారు. ఆయన చిత్తశుద్ధిని అంబేద్కర్ ప్రశ్నించారు. ఈ విషయంలో అంబేద్కర్ వాదన సరైందని అన్పిస్తుంది.
మతంలో నుంచి పుట్టి పెరిగి వర్ధిల్లుతున్న కులం, అందులోనుంచి విషపుత్రికగా అవతరించిన అంటరానితనాన్ని అంబేద్కర్ చక్కగా వివరించారు. మూలసమస్య పరిష్కారం కావాలంటే మూలదోషాలనుంచి దళితులు బయటపడాలన్నారు. మతాన్ని ఎందరు సంస్కరించబోయినా విఫలంగావడానికి కారణం, మూలం జోలికిపోకపోవడమే.
రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది. అయినా అది పోలేదు. మాల,మాదిగ పేరిట దూషణలుగా శిక్షార్హం చేసిన చట్టాలువచ్చాయి. కాని దళితులు వూరికి దూరంగానే వున్నారు.
దళితులకు వున్న ఓటు హక్కును గుర్తించిన రాజకీయ పార్టీలు, దళితులలో దళారీలను ప్రోత్సహించాయి. ఎన్నికలనాడు ఓటు వేయించుకుంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకూ ఎన్నికైన ప్రతినిధిని రీకాల్ చేసే అవకాసం లేదని పార్టీలకు తెలుసు.
ఆర్థిక విషయాలకే ప్రాధాన్యత యిచ్చి రాజకీయ పార్టీలు ఆకర్షణలకు దిగాయి. ఇందుకు భాగంగానే భూములివ్వడం, ఇళ్ళ స్థలాలు కేటాయించడం,స్కాలర్ షిప్ లు,గుడులు , మందిరాలు నిర్మించడం, రిజర్వేషన్ల పేరిట ఉచ్చు పన్నడం అన్ని రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఆడుతున్న నాటకమే. దీనిలో ఇరుక్కున్న దళిత నాయకత్వం ఆయా రాజకీయ పార్టీలకు అమ్ముడుబోయి హాయిగా అనుభవించడం చూస్తూనే వున్నాం.
కాని దళితుల ప్రధాన సమస్య-అంటరానితనం అలాగే వుంది. అంబేద్కర్ సూచించిన మూలపరిష్కార మార్గం జోలికి పోతేనే యీ సమస్య పరిష్కారమై దళితులు మానవులుగా సమానహక్కులతో మనగలరు.