పుట:Aandhrakavula-charitramu.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిల్లలమఱ్ఱి - పినవీరన్న


పిల్లలమఱ్ఱి పివవీరన్న యనెడి యీ కవి నియోగి బ్రాహ్మణుఁడు; గాదయామాత్యునకును, నాగాంబకును పుత్రుఁడు; పెదవీరన్న తమ్ముఁడు; భారతీ తీర్థుల శిష్యుఁడు; నిరుపమానమైన కవిత్వధార గలవాఁడు. ఇతఁడు తాను రచియించిన జైమినిభారతాశ్వమేధపర్వమునకు సాళువగుండ నృసింహనృపాలుని నాయకునిఁగాఁ జేసెను. అతడు కృష్ణ దేవరాయల పూర్వులయిన బుక్కరాజాదుల సంతతివాఁ డయినట్టును. బళ్ళారిమండలములోని యానేగొంది సంస్థానమును పాలించుచుండినట్లును తెలియవచ్చుచున్నది. సాళువగుండరా జొకఁడు హూణశకము 1390 వ సంవత్సరము మొదలుకొని 1397 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసినట్టును, రెండవ సాలవ గుండరాజు 1421 వ సంవత్సరము మొదలుకొని 1428 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినట్టును బళ్ళారిమండలచరిత్ర సంగ్రహ మువలనఁ దెలియవచ్చుచున్నది. ఈ కడపటఁ జెప్పఁబడిన సాళువగుండ రాజునకు జైమినీభారతము కృతి నందిన నరసింహభూపాలుఁడు పుత్రుఁడైనట్టు కానఁబడుచున్నది గనుక, పిల్లలమఱ్ఱి పినవీరన్న 1428 సంవత్సరమునకుఁ దరువాతనే యున్నట్టు స్పష్టమగుచున్నది. సాళువగుండనరసింహరాజు 1465 మొదలుకొని 1478 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసిన విరూపాక్షరాయని సేనానాయకుడుగానుండి 1478 వ సంవత్సరమునం దాతనిరాజ్యము నాక్రమించుకొని 1487 వ సంవత్సరము వఱకో 149౩ వ సంవత్సరమువఱకో స్వతంత్రముగా రాజ్యముచేసెనని చరిత్రకారులు చెప్పుచున్నారు. 1483 వ సంవత్సరము మొదలుకొని [1] తుళువ నరసింగరాయని శాసనములు కనఁబడుచున్నందున నప్పటితోనే యీతని రాజ్యసమాప్తి యయి యుండును. సాళువ నరసింహరాజు పూర్వులు సహితము బుక్కరాజాది కర్ణాటాధీశ్వరుల దండనాథులయి


  1. [ఇతఁడు నరసరాజని ప్రసిద్దుఁడు.]