పుట:Aandhrakavula-charitramu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

             క. శ్రీ సంభావితవక్షో
                భాసురమణిహారకిరణపరిచయచతురో
                ల్లాసమృదుహాసయవిరత
                భూసురగృహరచిత హేమ ! పోలయవేమా !'

 అని పూర్వభాగము షష్ఠాశ్వాసప్రారంభమునందును,

             క. 'శ్రీనందనసమ సౌంద
                 ర్యానందితయువతిహృదయ ! యధికాభ్యుదయా
                 యానతజన హృద్యదయా
                 భూనుతజయశక్తి భీమ ! పోలయవేమా !

అని యుత్తరభాగమున నష్టమాశ్వాసప్రారంభమునందును, కవి కృతిపతిని "పోలయవేమా !" యని సంబోధించుటచేతను,

             చ. కులజలరాశిచంద్రుఁడగు కోమటిపోలనయన్ నితంబినీ
                 తిలకము పుణ్యురాలు పతిదేవత యన్నమయుం గృతార్థతా
                 కలితులు ధీరు వేమవిభుఁ గానఁగఁ గాంచిన పుణ్య మొద్ది యే
                 కొలఁదుల నెన్ని జన్మములఁ గూర్చిరొనాఁ బొదలున్ జనస్తుతుల్."

అని కృత్యాదియందు వేమనను గన్నవారు పోలనయు నన్నమయునని స్పష్టముగాఁ జెప్పుటచేతను, హరివంశమును గృతి నందినవాఁడు పోలయ వేమారెడ్డియే యనుట నిశ్చయము. అంతేకాక కృత్యాదియందు నెఱ్ఱనయే కృతిపతితో నిట్లనియెను --

             క. "కావునఁ జెప్పెదఁ గళ్యా
                 ణావహమహనీయరచన హరివంశము స
                 ద్భావమున నవధరింపుము
                 భూవినుతగుణాభిరామ ! పోలయవేమా!"
ఇంతవఱకును బయల్పడిన శాసనాదులనుబట్టి రెడ్ల ప్రభుత్వకాలమును, సంబంధమును తేటపడుటకయు వారి వంశవృక్షము నిచ్చట నిచ్చుచున్నాను--