పుట:Aandhrakavula-charitramu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

రాకపోయినందున వానిని నిరాకరించి తాను రచింపఁబోయెడు గ్రంథము నన్నయభట్టారకునికవిత్వమువలెనే యుండినను తన దంతకంటె మెఱుఁగుగా నుండునని సూచించుట కయి తిక్కన యట్లు చేసెనని గ్రహించి యాతనిని పిలిపించినట్లును, గ్రంథరచనకుఁ బూర్వమునం దాతనిచేత గౌతమీతీరమున యజ్ఞము చేయించి భారతము సంపూర్ణము చేయించినట్లును చెప్పుదురు. మఱికొందఱట్లు పంపిన పద్య మాదిపర్వములోని

      ఉ. "నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణా
           ఖండల శస్త్రతుల్యము, జగన్నుత ! విప్రులయందు; నిక్క మీ
           రెండును రాజులందు విపరీతము, గావున విప్రుఁ డోపు, నో
           పండతి శాంతుఁడయ్యు నరపాలుఁడు శాపముఁ గ్రమ్మఱింపఁగన్"

అనునది యనియు, రాజనరేంద్రుఁడు తిక్కనయభిప్రాయమును దెలిసి కొన్న మీఁదట తనవద్ద కా కవీంద్రునిఁ బంపుమని సిద్దిరాజునకు విజ్ఞాపన పత్రమును పంపగాఁ నతఁ డా ప్రకారము చేసెదనని వాగ్దానము చేసెననియు, పిమ్మట దిక్కనను రప్పించి రాజనరేంద్రునికిఁ దాను జేసిన వాగ్దానమును జెప్పి నెల్లూరినుండి రాజమహేంద్రవరమునకుఁ బోవఁ బ్రార్థించె ననియు, ఆ రాజెన్ని విధముల జెప్పినను వినక తిక్కన రాజమహేంద్రవరము పోనని మూర్జపుపట్టుపట్టగా తనమాటకు భంగము వచ్చునని కోపించి రాజాతనితో నీవు నా యాజ్ఞప్రకారము పోని పక్షమున నీ మీసములు గొఱిగించి వాద్యములతో నగరివీధులవెంబడిని ద్రిప్పి యూరిబయల వేసిన తాటాకులపాకలోబెట్టి నీచేత మాంసము తినిపించెద నని బెదిరించెననియు, ఆగ్రహావేశముచేత బలికిన యా రాజుతర్జనభర్జనములకు భయపడక తిక్కన తనపట్టును వదలక స్టైర్యముతో నుండఁగా రాజనరేంద్రుఁడా సంగతి తెలిసికొని యెట్లయిన భారతమును తెనిఁగించినఁ జాలునని నెల్లూరిరాజయిన మనుమసిద్దికి వర్తమానము పంపెననియు, తరువాత సిద్దిరాజు తిక్కనను బతిమాలుకొని తాఁ జేసిన ప్రతిజ్ఞ బొంకు గాకుండునట్టుగా, యజ్ఞదీక్షకు ముందు విధివిహిత మయిన క్షురకర్మ