పుట:2015.392383.Kavi-Kokila.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము 5 : విడిది యిల్లు.

_________

[విజయవర్మ సోఫాపై నానుకొని యొక పుస్తకము చదువుచుండును. తెర యెత్తఁబడును]

విజయవర్మ : చాణక్యుఁ డొక్కఁడే నా మనస్సుకెక్కిన నీతివేత్త! సాంసారిక రాజకీయ ధర్మముల నాతఁడు భేదము నిరూపించెను. కార్యదక్షులు ఫలసిద్ధికొఱకు నెంతటి కార్యములనైన నొనరింతురు.

[సమరసేనుఁడు ప్రవేశించును.]

విజ : ఏవైన క్రొత్త విశేషములు కనుఁగొంటివా?

సమరసేనుఁడు : [కూర్చుండి] తమరి దగ్గఱ విశేషములు వినవచ్చితిని.

విజ : అంతియేనా? - సమరసేనా, చిన్నబహుమానముతో ఎట్టి పరిచారకుని నోటితాళములైన ఊడిపోవును. ఈకుటుంబ రహస్యములన్నియు గ్రహించితిని. మనోరమ మాధవుని వలచియున్నదఁట! తల్లికిని కుమారునకును నాసంబంధ మంగీకారము కాదఁట.

సమ : అటులనా! ఇంట నందఱును ప్రతికూలురైనపుడు శాంతవర్మమాత్ర మేమి చేయును?

విజ : ఆతని కోఁతిపిడికిలిపై నాకు నమ్మకము గలదు - కాక పోయినను నాకొక యుపాయము తోఁచుచున్నది.

సమ : సూచింపుఁడు! తత్క్షణమె నిర్వహించెదము.

విజ : రాజశేఖరుని రహస్యముగ మన దుర్గమున దాఁచియుంచ వలయును. వాని సాహాయ్యములేనిదే రాణి స్వతంత్రముగ నేమియు చేయఁజాలదు.