స్థలము 5 : విడిది యిల్లు.
_________
[విజయవర్మ సోఫాపై నానుకొని యొక పుస్తకము చదువుచుండును. తెర యెత్తఁబడును]
విజయవర్మ : చాణక్యుఁ డొక్కఁడే నా మనస్సుకెక్కిన నీతివేత్త! సాంసారిక రాజకీయ ధర్మముల నాతఁడు భేదము నిరూపించెను. కార్యదక్షులు ఫలసిద్ధికొఱకు నెంతటి కార్యములనైన నొనరింతురు.
[సమరసేనుఁడు ప్రవేశించును.]
విజ : ఏవైన క్రొత్త విశేషములు కనుఁగొంటివా?
సమరసేనుఁడు : [కూర్చుండి] తమరి దగ్గఱ విశేషములు వినవచ్చితిని.
విజ : అంతియేనా? - సమరసేనా, చిన్నబహుమానముతో ఎట్టి పరిచారకుని నోటితాళములైన ఊడిపోవును. ఈకుటుంబ రహస్యములన్నియు గ్రహించితిని. మనోరమ మాధవుని వలచియున్నదఁట! తల్లికిని కుమారునకును నాసంబంధ మంగీకారము కాదఁట.
సమ : అటులనా! ఇంట నందఱును ప్రతికూలురైనపుడు శాంతవర్మమాత్ర మేమి చేయును?
విజ : ఆతని కోఁతిపిడికిలిపై నాకు నమ్మకము గలదు - కాక పోయినను నాకొక యుపాయము తోఁచుచున్నది.
సమ : సూచింపుఁడు! తత్క్షణమె నిర్వహించెదము.
విజ : రాజశేఖరుని రహస్యముగ మన దుర్గమున దాఁచియుంచ వలయును. వాని సాహాయ్యములేనిదే రాణి స్వతంత్రముగ నేమియు చేయఁజాలదు.