పుట:2015.392383.Kavi-Kokila.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

227 మాధవ విజయము


రాజ : [తండ్రిప్రక్కనకూర్చుండి] అవును! సమయమునకే వచ్చితిని, నేఁడే సర్దారు పంజాబు గుఱ్ఱముల బిడారును వజ్రపురికి కదలించుచున్నాఁడు. ఈసమయము తప్పిన నొకకుంటి గుఱ్ఱము కూడ మనకు దొఱకదు.

శాంత : గుఱ్ఱపు బిడారేమిటి?

రాజ : పంజాబుసర్దారు కందుకకేళి యలవడిన బొమ్మలవంటి యవనాశ్వములను అమ్మకమునకై మన పట్టణమున నిల్పియున్నాఁడు.

శాంత : రాజశేఖరా, నీ కందుకకేళి పిచ్చి మితిమీరుచున్నది. నిరుడు కొన్నవికాక ఈ యేడును గుఱ్ఱములు కొనవలయునా? ప్రతిసంవత్సరమును వానిపోషణమునకు తరిబీదునకు రెండులక్షల రూపాయలు ఖర్చు పెట్టుచున్నావు. ఒక్క పందెమైన గెలిచితివా? మహాభారతమున -

రాజ : [విసుగుతో] మీ మహాభారత పురాణ శ్రవణమునకు తీఱికలేదు. నేను పదిగుఱ్ఱములు కొనవలయును.

యశో : [కన్నురుముచు] ఆ! శేఖరా, నీవింకను మట్టు మర్యాదలు నేర్చుకొనవు.

శాంత : [కోపముతో] ఈ యవిధేయత నేనొక్కక్షణమై నోర్చుకొనను. [భార్యతట్టుతిరిగి] ఇదియంతయు నీగారాబము - నీ చనవు - వీనికి తృణీకరభావము తుంటరితనము హెచ్చి పోవుచున్నది. మాధవునికిని వీనికిని ఎంతయో తారతమ్యము గలదు.

రాజ : అవునవును. మాధవుఁడు మీకడుపునఁబుట్టిన బిడ్డకదా!

శాంత : కాకపోయిన నేమి? పరాయిబిడ్డయే యోగ్యుఁడుగ నగపడుచున్నాఁడు.

యశో : కుమారునిబాల్య చాపల్యమును మన్నింపుఁడు. ఇంకను ఆటప్రాయమేగదా. [రాజశేఖరునికి కనుసైఁగచేయుచు]

రాజ : నాతొందరపాటు మన్నింపుఁడు.

శాంత : నీవు మహాభారతమును చదివి మట్టు మర్యాదలు నేర్చుకొనవలయును.